అవును… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్ పేరు చెపితే వైసీపీ నేతలందరికీ ఆందోళ‌న క‌లుగుతోంద‌ట‌. లోకేష్‌ చేతిలో ఉన్న “రెడ్ బుక్” పేరు వినగానే చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా, “వైసీపీ నాయ‌కులు చేసిన అన్యాయాలన్నీ రెడ్ బుక్‌లో రాసుకుంటున్నా… అధికారంలోకి వచ్చాక వారందరికీ సమాధానం చెబుతా” అని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ మాటలను వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రెడ్ బుక్ కథ మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలపై కేసులు నమోదవ్వడం, విచారణలు ప్రారంభమవ్వడం వాళ్లు టెన్షన్‌లో ఉన్నారు. కొందరు నేతలు జైలు పాలయ్యారు, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు “లోకేష్ ఇప్పుడు నిజంగానే రెడ్ బుక్ పేజీలు తెరవబోతున్నాడు” అన్న ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది.


ఇదే సమయంలో నారా లోకేష్ మరో ముఖ్యమైన అంశంపై దృష్టి సారించారు. అది సోషల్ మీడియా నియంత్రణ. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, దూషణలు, తప్పుడు ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో నారా లోకేష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా పర్యవేక్షణ మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఈ అంశంపై చాలా సీరియస్‌గా ఉందని సమాచారం. మొదట కేంద్రం తరహాలో చట్టం చేయాలనే ఆలోచన వచ్చినా, అది సాంకేతికంగా సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు నియమ నిబంధనల పరిధిలోనే కఠిన చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తోంది.


కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే హోంశాఖ జీవో ఇవ్వొచ్చని సమాచారం. ఇప్పటికే ఈ పరిణామాలపై వైసీపీ లోపలే భయం మొదలైంది. “రెడ్ బుక్ కష్టాలు చాలవు… ఇప్పుడు సోషల్ మీడియాపై కూడా లోకేష్ దృష్టి పెడితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందేమో” అనే టాక్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చేస్తున్న ప్రతి చర్యను వైసీపీ నేతలు గమనిస్తూ, అంతర్గత చర్చల్లో దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, నారా లోకేష్ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ నేతలకు ఒక సింహ స్వప్నంగా మారిపోయారు అనడం అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: