ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకు 2025 ఒక మైలురాయిగా నిలిచింది. గతేడాది అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎదురైన ఆర్థిక సవాళ్లు, పరిపాలనాపరమైన చిక్కుముడులను విప్పుకుంటూ వచ్చిన ఆయన, ఈ ఏడాది పాలనపై తనదైన ముద్ర వేశారు. విజన్ 2047 లక్ష్యంతో అడుగులు వేస్తున్న చంద్రబాబు, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని సమన్వయం చేయడంలో సఫలీకృతులయ్యారు.


రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా పర్యటించారు. స్విట్జర్లాండ్ (దావోస్), సింగపూర్, బ్రిటన్, దుబాయ్ వంటి దేశాల్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పర్యటనల ఫలితంగా పలు ఎంఓయూలు (MoUs) కుదిరాయి. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఊపిరి పోసింది. ముఖ్యంగా గూగుల్ డేటా కేంద్రాన్ని ఏపీకి తీసుకురావడం చంద్రబాబు చాణక్యతకు నిదర్శనం. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే దిశగా గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ఒక గేమ్ ఛేంజర్‌గా మారింది.


గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పనులను ఈ ఏడాది యుద్ధప్రతిపాదికన ముందుకు తీసుకెళ్లారు. ప్రపంచ బ్యాంకు మరియు ఇతర కేంద్ర సంస్థల నుంచి నిధులను సాధించడంలో విజయం సాధించారు. గత ప్రభుత్వ అప్పులు, అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ప్రజల్లో పారదర్శకతను పెంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా, పార్టీ మరియు ప్రభుత్వ సమన్వయంలో చంద్రబాబు కొత్త ఒరవడిని చూపారు. పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో గతంలో కంటే భిన్నంగా, ఓర్పుతో వ్యవహరించి అందరినీ కలుపుకుపోయారు.


సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూనే, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి న్యూట్రల్ ఓటర్ల మనసు గెలుచుకున్నారు.
చంద్రబాబు పాలనా సంస్కరణలను గుర్తించిన ఎకనామిక్ టైమ్స్, ఆయనకు ‘బిజినెస్ రిఫార్మర్ - 2025’ అవార్డును ప్రకటించింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొనడంలో ఆయన సాధించిన విజయానికి ఇది నిదర్శనంగా నిలిచింది. మొత్తంగా 2025 ఏడాది చంద్రబాబును ఒక సమర్థవంతమైన పాలకుడిగా, అభివృద్ధి ప్రదాతగా మరోసారి నిరూపించింది. గతంలో కంటే పరిణతి చెందిన రాజకీయ వ్యూహాలతో, ఏపీని మళ్ళీ అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: