సాధారణంగా భారతదేశంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లోనూ రైస్ ప్రధాన ఆహారాల్లో ఒకటి. సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువగా తింటారు. చౌక ధరకే బియ్యం లభించడం, ఏ కూరతోనైనా కలుపుకుని తినగలిగే సౌలభ్యం ఉండడంతో మన దగ్గర అన్నాన్ని ఎక్కువగా తింటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో భాగంగా రైస్ తీసుకుంటుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గాలనుకుంటే అన్నం తినడం మానేస్తుంటారు. అన్నం తినకుండా ఉంటే బరువు ఈజీగా తగ్గుతామని చాలా మంది భావన.
కానీ, వాస్తవానికి నిత్యం శారీరక శ్రమ చేసే వారు అన్నం ఎంత తిన్నా వారికి అనారోగ్యాలు రావు. కానీ శారీరక శ్రమ లేకుండా, నిత్యం ఒకే దగ్గర కూర్చుని పనిచేసే వారికైతే అన్నం తెచ్చి పెట్టే తంటాలు అన్నీ ఇన్నీ కావు. శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు కాదు. క్యాలరీలు పేరుకుపోతుంటాయి. అధికంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు, షుగర్ వంటి అనారోగ్యాలు వస్తాయి. అలా అని అన్నం తినడం తప్పు కాదు. అన్నం తింటే కొవ్వు పేరుకుపోతుందని అనుకోవడం పొరపాటు.
కొన్ని సమయాల్లో అన్నం తింటే జీవక్రియ బాగుంటుంది. పగటి సమయములో అన్నం బాగా తినొచ్చు. అయితే రాత్రిపూట మాత్రం రైస్ను తినకపోవడమే మంచిది. బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి తక్షణ శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అవసరమే. కానీ అచ్చం అన్నాన్నే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నేసి కార్బోహైడ్రేట్లను శరీరం ఖర్చు చేయలేదు. దాంతో అవి కొవ్వుగా మారతాయి. ఫలితం బరువు పెరుగుతారు. అందుకే జీవక్రియలు అధికంగా ఉండే పగటిపూట రైస్ తీసుకోవాలి. డిన్నర్ లో అన్నానికి బదులు వేరే పదార్థాలను తీసుకోవాలి. మరియు పడుకునే ముందు ఆహారం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. తేలికైన ఆహారం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అదే సమయంలో కంటినిండా నిద్ర పడుతుంది.