విటమిన్ (ఏ ) లోపం ఆరోగ్య సమస్య కాదని తేల్చి చెప్పిన ఎన్ఐఎన్..

 చిన్నారుల్లో విటమిన్‌ (ఏ) లోపాన్ని ఇప్పుడు ప్రజారోగ్య సమస్యగా పరిగణించాల్సినవసరం లేదని జాతీయ పోషకాహార సంస్థ   చెప్పింది. జాతీయ స్థాయి పరిశోధన సంస్థలతో కలిసి చేసిన సర్వేలో భారత్‌లో విటమిన్‌ ఏ లోపం 14.9% ఉందని పేర్కొన్నారు. శరీరంలో  ఏ విటమిన్ ఎక్కువైతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న నేపథ్యంలో అవసరం ఉన్న వరకే డోస్‌లు ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఓ నివేదికను ఎన్‌ఐఎన్‌ ఈ మద్యే విడుదల చేసింది.

1950 నుంచి 1969 వరకూ దేశంలోని చిన్నారుల్లో ఏ విటమిన్‌ లోపం అధికంగా ఉండటం వల్ల  అంధత్వ సమస్యలు, రేచీకటి ఎదుర్కొన్నారని అన్నారు.
దీంతో దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ ఆరు నెలలకొకసారి విటమిన్ ఏ చుక్కల మందు ఇచ్చే ప్రోగ్రామును  ప్రభుత్వం  ప్రారంభించింది. 40 ఏళ్లుగా ఈ కార్యక్రమం సాగుతూ వస్తోంది.  అంటురోగాలకు వేరే వ్యాక్సిన్ వేస్తుండడంతో పాటు, పోషక ఆహార పదార్థాలు తీసుకోవడం, అలాగే  కొన్ని ఆహార పదార్థాలలో  విటమిన్ ఏ  ఎక్కువగా ఉండడం వల్ల  ఈ విటమిన్ విడిగా ఇవ్వాల్సిన అవసరం లేదని అధ్యయనం చేసిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం  21శాతం కంటే ఎక్కువ మందిలో  ఈ విటమిన్ లోపం ఉంటేనే దాని ప్రజా ఆరోగ్య సమస్యగా  గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై ఐదు సంవత్సరాలోపు పిల్లల్లో  పరిశోధన చేయగా  ప్రస్తుతం  దేశంలో 15.6 శాతం మందిలో  మాత్రమే  లోపం ఉన్నట్టు తేలిందని ఎన్ఐఎన్ సంచాలకులు డాక్టర్.  హేమలత అన్నారు. ఈ అధ్యయనంలో వెల్లడించిన ప్రకారం  అందులో  మిజోరం, తెలంగాణ, జర్ఖండు రాష్ట్రాల్లో  ఈ సమస్య కాస్త ఎక్కువ ఉన్నట్లు  గుర్తించామన్నారు. కానీ  ఈ రాష్ట్రాల్లో  జిల్లాల వారీగా  పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: