
ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేరళలో 253 కరోనా కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడులో 66 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 56 కేసులు ఉన్నాయి. ఇకపోతే ఢిల్లీలో 23 కేసులు, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళలో నమోదు కావడం ఆశ్చర్యకరం. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు సూచించాయి.
ఇక కరోనా కారణంగా ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. మహారాష్ట్రలోని థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అలాగే బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందడం జరిగింది. దీంతో ప్రజలు మరింత జాగ్రత్త పడాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్రం సూచిస్తుంది. అయితే ప్రస్తుతం వచ్చిన వేరియంట్లు ప్రమాదకరం కాకపోయినప్పటికీ వైరస్ ఎంత ప్రమాదకరమైందో తెలిసిందే. కాబట్టి కొత్త వేరియంట్ లు కూడా పుట్టుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా లక్షణాలు చూసినట్లయితే.. తాజా వేరియంట్ లు ఎక్కువగా గొంతు పై ప్రభావం చూపిస్తున్నాయి. దీని కారణంగా ఎక్కువగా పొడి దగ్గుతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉంది.