సీజన్ మారేకొద్ది చిన్నపిల్లలు తరచూ రోగాల బారిన పడుతుంటారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే చిన్న పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో పిల్లలకు ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, పాలు తాగించాలి. శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి.. గోరు వెచ్చని నీటిలో తడిబట్టను ఉపయోగించి పిల్లాడి తల నుంచి అరికాళ్ల వరకు తుడవాలి. అప్పుడే శరీర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

చిన్న పిల్లలకు తడిబట్ట వేసినప్పుడు మెడ భాగం, చంకలు, తొడల మధ్యల్లో 15 నుంచి 20 నిమిషాల పాటు శరీరాన్ని తుడవాలి. అలా చేసిన 30 నిమిషాల తర్వాత శరీర ఉష్ణోగ్రత నార్మల్ స్థాయికి చేరుకుంటుంది. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఆ సమయంలో పిల్లలకు ద్రవపదార్థాల కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. కొద్ది కొద్దిగా ఆహారం అందించడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతుంది. అయితే తల్లిపాలు తాగే పిల్లాడికి జ్వరం వచ్చినప్పుడు పాలు తాగడానికి ఇష్టపడడు. అప్పుడు తల్లిపాలను కప్పులో తీసి చెంచాతో పట్టించాలి. అప్పుడే పిల్లాడు పాలు తాగేందుకు ఆస్కారం ఉంటుంది.

పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు కనీస అవగాహన లేని తల్లిదండ్రులు సొంత వైద్యం చేయకూడదు. పిల్లలకు ఎప్పుడు యాంటీబయాటిక్స్ ట్యాబెట్లు ఇవ్వకూడదు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. పిల్లలకు ఇచ్చే మెడిసిన్స్ వారి బరువుపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్‌లో లభించే మెడిసిన్స్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. పిల్లల శరీర బరువులో కిలోకు 10-15 మిల్లి గ్రాముల పారాసెటమాల్ ట్యాబెట్‌ను వాడాలి. లేదా సిరప్‌ను తీసుకోవాలి. ఇలా చేస్తే తొందరగా జ్వరం తగ్గుతుంది.

నోటి ద్వారా మందు తీసుకోనప్పుడు పారాసెటమాల్ రెక్టల్ సపోసిటరీస్ లభిస్తుందని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కర్రా రమేశ్ రెడ్డి తెలిపారు. దీనిని పిల్లాడి మలద్వారం ద్వారా లోపలకి పెట్టాలి. ఈ ఇచ్చిన అరగంట తర్వాత దీని ప్రభావం మొదలవుతుంది. మూడు గంటలోపు జ్వరం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. జ్వరం తీవ్రత మొత్తానికి తగ్గకపోతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: