తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' అనే రీమేక్ సినిమాలో నటించనున్నారు. మలయాళంలో వచ్చిన ఈ హిట్ సినిమాలో పవన్ కాకుండా కీలకమైన మరో హీరో పాత్ర కూడా ఉంటుంది. ఈ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తారంటూ మొదటి నుంచీ పేరు వినిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా పవన్ అభిమాని యంగ్ హీరో నితిన్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కన్నడ బిజీ స్టార్ కిచ్చ సుదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకు సుదీప్ బాగా సూటవుతాడని భావించిన దర్శక నిర్మాతలు ప్రస్తుతం అతనితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ వార్తలో నిజమెంతుందన్నది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, ఇందులో పవన్ సరసన కథానాయిక పాత్రకి సాయిపల్లవిని అడుగుతున్నారట. మొత్తానికి ఈ సినిమా చాలా విశేషాలని సంతరించుకుంటోందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.