అటు అక్కినేని ఇటు నందమూరి తెలుగు సినీ కళామతల్లి ముద్దు బిడ్డలు. వారు సినిమా ప్రపంచానికి నడక నేర్పారు. పరుగులు పెట్టించారు. తెలుగు సినిమా స్టామినా ఏంటో యావత్తు లోకానికి తెలియచేశారు. వారున్న కాలం స్వర్ణ యుగం అనిపించారు. ఎన్నో కళాఖండాలను భావి తరాలకు అందించారు.

వారి వారసులుగా బాలక్రిష్ణ, నాగార్జున టాలీవుడ్ లో సూపర్ స్టార్లు అయ్యారు. ఈ రోజుకీ ఇద్దరూ నటిస్తూ అలరిస్తూనే ఉన్నారు. బాలయ్య వంద చిత్రాలు పై చిలుకు నటిస్తే నాగ్ వందకు చేరువలో ఉన్నారు. ఇద్దరి కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య నాగ్ లను కలిపి మల్టీస్టారర్ మూవీని తీయాలని అప్పట్లో చాలా మంది ట్రై చేశారు. గుండమ్మ కధ ఈ ఇద్దరితోనే తీయాలన్న పట్టుదల కూడా కొందరు నిర్మాతల్లో ఉండేది.

అయితే అది వర్కౌట్ కాలేదు ఆ తరువాత చాన్నాళ్లు ఇద్దరూ కలసి మెలసి ఉన్నా ఈ మధ్య మాత్రం కొంత ఎడబాటు వచ్చిందని ప్రచారం అయితే ఉంది. ఆ మధ్య విశాఖలో జరిగిన టీఎస్సార్ ఫంక్షన్ లో  ఈ ఇద్దరినీ కలిపి ఫ్యాన్స్ కి ఖుషీ చేయించారు. అయితే ఆ తరువాత మళ్ళీ ఈ ఇద్దరూ భేటీ అయిన సందర్భాలు అయితే లేవు. ఇపుడు ఆ ముచ్చట తీర్చేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్  రెడీ అయ్యారని అంటున్నారు. ఆయన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద బాలయ్య హోస్ట్ గా ప్రారంభవుతున్న టాక్ షోలో నాగార్జున ఒక వారం ఎపిసోడ్ గెస్ట్ గావస్తారు అని టాక్ నడుస్తోంది.

ఈ ఇద్దరు ముచ్చట్లూ చేసే  అల్లర్లు  అన్నీ కలగలసి ఆ టాక్ షోని అద్భుతంగా తీర్చిదిద్దుతారు అంటున్నారు. అంటే ఈ ఇద్దరూ కలసి చేసే సరదాలు ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తాయి అన్న మాటే కదా. మొత్తానికి ఈ టాక్ షో కనుక నిజమైతే ఈ ఇద్దరి మల్టీ స్టార‌ర్ మూవీని చూడలేమనుకున్న వారి ఆశలు చాలా వరకు తీరే అవకాశం అయితే ఉంది. సో అంతా వెయిట్ చేయాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: