
ప్రస్తుతం రవితేజ నటించిన తాజా చిత్రం “మాస్ జాతర” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో రవితేజ చురుకుగా పాల్గొంటూ, అభిమానులతోనూ మీడియాతోనూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. ఇంటర్వ్యూలో రవితేజ ప్రస్తుత సోషల్ మీడియా రివ్యూల ట్రెండ్పై ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ – “ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా రివ్యూలు చెప్పే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. వారిలో చాలామంది థియేటర్లకు అసలు వెళ్ళరే. ఎవరో ఒకరి మాట విని, సినిమాను పూర్తిగా అర్థం చేసుకోకుండా తమకు నచ్చిన విధంగా రివ్యూలు ఇస్తూ ఉంటారు. వాళ్ళని నేను మేధావులు అంటాను! కానీ వాళ్ళకు ఏ సినిమా నచ్చదు. నేను కమర్షియల్ సినిమాలు చేసినా, రొమాంటిక్ సినిమాలు చేసినా, ఎమోషనల్ సినిమాలు చేసినా – వాళ్ళు ఏదీ అప్రిషియేట్ చేయరు,” అని తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
అంతేకాకుండా ఆయన ఇంకా అన్నారు –“జనాలు నన్ను ‘గీతాంజలి’ లాంటి సీరియస్ సినిమాల్లో చూడాలని అనుకోరు. కానీ నేను ఏదైనా డిఫరెంట్గా ప్రయత్నించినప్పుడు కూడా వాళ్లు సపోర్ట్ చేయరు. ఇప్పుడు చాలా మంది కరోనా కాలం తర్వాత ఓటీటీ కంటెంట్కి అలవాటు పడ్డారు. అందుకే థియేటర్లలో సినిమా చూడటానికి ఆసక్తి చూపడం తగ్గిపోయింది. ‘ఓటీటీలో వస్తుందిలే అప్పుడు చూద్దాం’ అని టైం పాస్గా చూస్తారు. ఇది సినిమా పరిశ్రమకు పెద్ద సమస్య అవుతోంది,” అని మాస్ మహరాజా రవితేజ ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా రవితేజ తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్న వారిపై సీరియస్గా స్పందించడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. అభిమానులు మాత్రం “ఇదే రవితేజ స్టైల్ – సూటిగా, బోల్డ్గా మాట్లాడతాడు!” అంటూ సోషల్ మీడియాలో ఆయనను సపోర్ట్ చేస్తున్నారు.