దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్దఎత్తున వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఆయన హనుమాన్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. ఆయన రాసుకొస్తూ.."తమను దేవుడి భక్తులమని, నిజమైన విశ్వాసులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు ప్రస్తుతం విషం కక్కేలా వ్యవహరిస్తున్నారు. రాజమౌళి భారతదేశంలో నివసిస్తున్న ఒక పౌరుడు. ఈ దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి ఒక్కరికీ నమ్మే హక్కుతో పాటు నమ్మకపోవడానికి కూడా హక్కు ఇస్తుంది. కాబట్టి రాజమౌళి నాస్తికుడిగా ఉండటం నేరం కాదు, ఆయనకు ఉన్న స్వేచ్ఛను గౌరవించాలి"..


ఇక సోషల్ మీడియాలో కొందరు చెబుతున్న..“దేవుడిని నమ్మకపోతే తన సినిమాల్లో దేవుణ్ణి ఎందుకు చూపిస్తాడు?” అనే విమర్శపై కూడా వర్మ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే ఆయనే గ్యాంగ్‌స్టర్ కావాలా? భయానక చిత్రం తీయాలంటే తానే దెయ్యం కావాలా? అలాగే దేవుణ్ణి నమ్మని దర్శకుడు దేవుడి నేపథ్యంతో సినిమా తీయడం తప్పేంటి?" అని ఆయన ప్రశ్నించారు. దీన్ని అర్థం చేసుకోకుండా రాజమౌళిని దూషించే వారిని ‘గ్యాంగ్‌స్టర్లు’ అనడంలో కూడా వెనుకాడలేదు. అదే సమయంలో రాజమౌళి నాస్తికుడిగా ఉన్నప్పటికీ దేవుడు ఆయనకు అపార విజయాలు, గొప్ప పేరు, అసంఖ్యాక అభిమానుల ప్రేమను ఇచ్చాడని వర్మ వ్యాఖ్యానించారు. "రాజమౌళి పొందిన అదృష్టం, ఆయన సాధించిన స్థాయి—వాటిని చాలా మంది భక్తులు వంద జన్మల్లో కూడా అందుకోలేరు. దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తాడేమో!" అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.



ఇలాంటి విషయాల్లో దేవుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది దేవుడు నోట్‌ప్యాడ్‌లో రాసుకునేవి కావని కూడా సరదాగా చమత్కరించారు. వర్మ అభిప్రాయం ప్రకారం అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదు. "రాజమౌళి దేవుడిని నమ్మకుండానే ఘన విజయం సాధించాడు—అదే కొంతమంది ఓర్చి తట్టుకోలేరు,’’ అన్నారు. జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థనలు చేసినా విఫలమై నిరాశ చెందిన వారిలో కొన్ని అసూయ, అసహనం ఇలా బయటపడుతుందన్నారు. "దేవుణ్ని సమర్థించడం, ఆయన తరఫున వాదించడం నిజానికి ఆయనను అవమానించడం లాంటిదే. రాజమౌళి నాస్తికుడని చెప్పడం వల్ల దేవుని గొప్పతనం తగ్గదు. దేవుడు బాగానే ఉన్నాడు… రాజమౌళి కూడా బాగానే ఉన్నాడు. ఈ ఇద్దరినీ అర్థం చేసుకోలేని వారే బాధపడుతున్నారు,’’ అని ఆయన మరోసారి హైలైట్ చేశారు. చివరగా రామ్ గోపాల్ వర్మ "వారణాసి" సినిమా ద్వారా దేవుడు రాజమౌళికి మరో భారీ అదృష్టాన్ని జోడిస్తాడు. ఇవన్నీ దేవునిపై భక్తి పేరుతో బయటికి తెచ్చే అసూయ, ఈర్ష, అజ్ఞానం మాత్రమే. జై శ్రీరాం" అంటూ తన ట్వీట్ ని పోస్ట్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: