వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ అధినేత అశ్వనీదత్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి గొప్ప పేరు తెచ్చుకున్న ఆయన..ఆ సంస్థ ద్వారా హీరోలుగా పరిచయం చేసిన వారసులు ఎందరో ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ డమ్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కానీ ఆయన మాత్రం తన ప్రభావాన్ని చాటుకోలేక పోతున్నారు. రజనీకాంత్ తో నిర్మించిన కుచేలన్ రీమేక్ కథానాయకుడు నుంచి భారీ నష్టాల్ని చూసిన ఎన్టీఆర్ శక్తి సినిమాతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడంతో ఆయన ఇక సినిమాలు చేయడం కష్టమే అని ఇండస్ట్రీ మొత్తం అనుకున్నారు. అశ్వనీదత్ కూడా ఇక సినిమాలు మానేయడమే బెటరని ఒక దశలో నిర్ణయించుకున్నారు.

ఆ దశలో వైజయంతీ సంస్థకు నూతన ఉత్సాహాన్ని, పూర్వ వైభవాన్నీ మళ్ళీ తిరిగి తీసుకు వచ్చిన సినిమా మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా మలిచి ప్రశంసలు అందుకున్నాడు. నటన తెలియదన్న కీర్తి సురేష్ లో మహానటి దాగుందని సినిమా ప్రపంచానికి చెప్పాడు. ఇలాంటి బ్లాక్ బస్టర్ తరువాత అశ్వనీదత్ మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చేసిన సినిమా దేవదాస్. నాగార్జున - నాని కలయికలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో వైజయంతీ మూవీస్ మళ్ళీ మొదటికే వచ్చిందా అనే టాక్ మొదలైంది.

ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ సినిమా వుంటుందని.. మెగాస్టార్ - పవర్ స్టార్ ల కలయికలో భారీ మల్టీస్టారర్ వుంటుందని ప్రచారం జరిగింది. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. రామ్ చరణ్- జాన్వీల కలయికలో జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ చేస్తామన్నారు. కానీ ఆ అప్‌డేట్ కూడా లేదు. తమిళ దర్శకుడితో సినిమా అని ప్రకటించారు. కానీ దాని మాట కూడా వినిపించడం లేదు. ఒక్కసారిగా అశ్వనీదత్ లాంటి బడా నిర్మాత ఎందుకు సైలెంట్ అయ్యారు?. ఇంతకీ ఆయన నెక్ట్స్ సినిమా వుందా? లేదా? అని ఫిలిం సర్కిల్స్ లో చర్చ జరుగుతోందని లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: