గోదావరిలో పర్యాటక బోట్ల రాకపోకలు బాగా పెరిగాయి. సుమారు 100కి పైగా బోట్లు భద్రాచలం దిగువన వీఆర్ పురం మండలం నుంచి పాపికొండల వరకూ వస్తాయి. ఇక రాజమండ్రి వైపు నుంచి పోశమ్మ గండి, పోలవరం నుంచి కూడా బోట్లు బయలుదేరి పాపికొండల వరకూ వెళతాయి. అటూ ఇటూ బయలుదేరే ఈ బోట్లపై ఆధారపడి అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. పర్యాటకులయితే పాపికొండల్లో విహారం ద్వారా ఎంతో ఆనందాన్ని.. ఆహ్లాదాన్ని అనుభవిస్తుంటారు.
పాపికొండల దగ్గర గోదావరి నది రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది. రాజమండ్రి నుండి లాంచీ ప్రయాణం టూరిస్టులకు మంచి అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ మొక్కలు, వృక్షాలు ఉంటాయి. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి లాంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. అయితే కరోనా సమయంలో గోదావరిలో విహార యాత్రకు అనుమతినివ్వడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.