ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్ లో ఈ రోజు సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ టి. హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీ రామకృష్ణా రావు, శ్రీ రజత్ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ ఎస్ఎఎం రిజ్వీతో పాటు సీఎంఓ అధికారులు శ్రీమతి స్మితా సబర్వాల్, శ్రీ రాజశేఖర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శ్రీ శ్రీనివాస రావు, శ్రీ రమేశ్ రెడ్డి, శ్రీ గంగాధర్, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ శ్రీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ సుద్దాల సుధాకర్ తేజ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ శ్రీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు శ్రీ మురళీధర్, శ్రీ హరి రామ్, సీఎం ఓఎస్డీ శ్రీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఎస్ ఇ శ్రీ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కరోనా పట్ల భయాందోళనలు అక్కెరలేదని ప్రజలకు సీఎం తెలిపారు. అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం అన్నారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెల్లి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: