ఏపీ సీఎం జగన్ ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఇక దాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఈ విషయంలో ఏమైనా అద్భుతం జరిగితే తప్ప మార్పు ఉండకపోవచ్చు. ఈ విషయంపై ఈనెల 27 కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఇందులో కూలంకషంగా రాజధానుల విషయంపై చర్చిస్తారు. ఓ పైనల్ డెసిషన్ తీసుకుంటారు.

 

అయితే.. ఆ కేబినెట్ మీటింగ్ తర్వాత.. 28 న జగన్ విశాఖలో కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 27 న కేబినెట్ లో విశాఖ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే విశాఖ అభివృద్ధికి చెందిన కీలక ప్రకటనలు ఈనెల 28న విశాఖలో జగన్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే.. 28 న జగన్ విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించబోతున్నారు.

 

ఇదే వేదికగా ఆయన సంచలన ప్రకటనలు చేయొచ్చు. మౌలిక వసతుల ఏర్పాటుకు సుమారు వెయ్యి కోట్ల విలువ చేసే పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారట. త్వరలో మెట్రో రైలుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో జీఎన్‌ రావు కమిటీ నివేదికపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 

ముంబై తర్వాత విశాఖ అభివృద్ధి చెందే నగరమని కమిటీ గుర్తించిందన్నారు. రాష్ట్ర నైసర్గిక స్వరూపంతో పాటు ఆయా ప్రాంతాల్లో వనరులు వంటి అంశాలతో నివేదికను రూపొందించిందన్నారు. మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందన్నారు. మాటలు చెబుతూ, గ్రాఫిక్స్‌ చూపిస్తే పెట్టుబడులు రావని అన్నారు. రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

 

ఈ నెల 28న విశాఖలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే రెండు నెలల కాలంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయడానికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి బొత్స తెలిపారు. మొత్తానికి జగన్ నిర్ణయంతో విశాఖ దశ తిరగబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: