ఢిల్లీ బరిలో సామాన్యుడు సత్తా చాటాడు. కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురు నిలిచిన ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ పీఠం మీద జెండా పాతాడు. వరుసగా మూడు సార్లు ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి ఆమ్ ఆధ్మీ పవరేంటో చూపించాడు. అయితే వరుసగా మూడోసారి కూడా కేజ్రీవాల్కే జనం ఎందుకు పట్టం కట్టారు అన్న విషయంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను ఢిల్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే పూర్తి విరుద్ధ ఫలితాలు రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏఫీలో టీడీపీ, ఢిల్లీలో ఆప్ రెండు పార్టీలు పూర్తి బీజేపీ వ్యతిరేక స్టాండ్తోనే ఎన్నికల బరిలో దిగాయి. అయితే ఆంధ్రలో టీడీపీ చిత్తుగా ఓడిపోతే ఢిల్లీలో ఆప్ మాత్రం చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. మరి ఇక్కడ పనిచేసిన బీజేపీ పవర్, ఢిల్లీలో మాత్రం ఎందుకు పనిచేయలేదు.
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుపుకు కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. ఎన్నికల వ్యూహకర్తగా తనదైన మార్క్ చూపించిన పీకే, జగన్ గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాడు. ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రచారం విషయంలో పీకే సలహాలు జగన్ గెలుపులో కీలక పాత్ర వహించాయనటంలో సందేహం లేదు.
ఇదే ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలోనూ ఆప్ తరువాత బరిలో దిగటంతో అది కూడా కేజ్రీవాల్కు కలిసోచ్చింది. అయితే ఆప్ కోసం పీకే పనిచేసింది రెండు మాసాలే అయినా తనవంతుగా కేజ్రీవాల్కు అధికారం కట్టబెట్టడంలో సాయం చేశాడు. దీన్నిబట్టి చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న స్నేహం వైరం అనేది రాష్ట్రాల్లో పార్టీల మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.