ఢిల్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి కోలుకోలేని దెబ్బపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయకేవతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. అయితే ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఆమ్ ఆధ్మీ పార్టీకి గట్టిపోటియే ఇచ్చినా ఆశించిన ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయింది.
కొన్ని చోట్ల మంచి ఫలితాలు సాధించినా దాదాపు ఆరు జిల్లాల్లో ఘోరంగా విఫలమైంది. న్యూ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, వార్దా జిల్లాలో బీజేపీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. మిగతా చోట్ల మాత్రం కమలం పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. అధికార ఆప్ 50 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంటే బీజీపీ మాత్రం 15 స్థానాల్లోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ మొదలైన తొలి దశలో కాస్త పరవాలేదనిపించినా తరువాత పూర్తిగా వెనకపడింది.
బీజేపీ ఓటమికి రకరకాల కారణాలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రచారం విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లే ఈ ఫలితాలకు కారణం అని భావిస్తున్నారు. ఆప్పై బీజేపీ చేసిన ఆరోపణలు మిస్ ఫైర్ అయ్యాయి. అదే సమయంలో అభివృద్ధి మంత్రంలో ప్రజల్లోకి వెళ్లిన ఆప్ ప్రజల ఆదరాభిమానాలు పొందటంతో విజయం సాధించింది. ఎన్సార్సీ, సీఏఏ లాంటి అంశాలపై ఢిల్లీలో జరుగుతున్న తీవ్ర నిరసనలు కూడా ఫలితాల మీద ప్రభావం చూపించాయి.
పోలింగ్ జరిగిన వెంటనే ఆప్ విజయంపై క్లారిటీ ఇచ్చేశాయి ఎగ్జిట్ పోల్స్. అయితే కౌంటింగ్ వరకు బీజేపీ, కాంగ్రెస్లు మేకపోతు గాంభీర్యం చూపించినా కౌంటింగ్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే అందరికీ ఫలితాల మీద క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఆప్ వర్గాలు ఢిల్లీ వీదుల్లో సంబరాలు మొదలు పెట్టాయి. ఇక కేజ్రీవాల్ మూడోసారి అధికార పీటం చేపట్టడం లాంచనమే.