దాయాది దేశాలైన చైనా, పాకిస్థాన్ దేశాలతో యుద్ధం విషయమై ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారట. అంతేకాదు, యుద్ధానికి తేదీలను కూడా ఖరారు చేశారని ఉత్తర్‌ ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ సంచలనానికి తెర తీశారు. ఇలాంటి సంచలనాలు ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి సంచలన వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాల్లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అంతే వేగంగా నిర్ణయాలు ఉంటాయని స్వతంత్ర దేవ్‌ సింగ్ చెప్పుకొచ్చారు. చైనా, పాక్‌తో యుద్ధం ఎప్పుడు చేయాలో మోదీ నిర్ణయించారంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్తూ స్వతంత్ర సింగ్ మరో సంచలనానికి తెరతీశారు. ఇందుకు సంబంధించిన మరో వీడియో చక్కర్లు కొడుతోంది.

బీజేపీ ఎమ్మెల్యే సంజయ్‌ యాదవ్‌ ఇంట్లో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వతంత్ర దేవ్‌ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. భారత్‌ - చైనా నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాలు తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ గతంలో ఆయన వార్తల్లోకెక్కారు. మరోవైపు ఆదివారం (అక్టోబర్ 25) విజయదశమి సందర్భంగా చైనా సరిహద్దుకు సమీపంలో సిలిగురిలో ఆయుధ పూజలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పాలని భారత్ భావిస్తోందని స్పష్టం చేశారు. శాంతిని స్థాపించాలని భారత్‌ కోరుకుంటోందని వెల్లడించారు. అలాగని అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: