ఒక్కసారి గత రాజకీయాలు పరిశీలిస్తే.. అద్దంకిలో వరుస ఓటములు చవిచూసిన కరణం.. టీడీపీలోకి వచ్చిన / రాకముందు కూడా గొట్టిపాటి రవికుమార్పై నిత్యం గొడవలు పడేవారు. ఆయనపై ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నించారు. దీంతో అద్దంకి రాజకీయాలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. రౌడీయిజం పెరిగిపోయిందనే టాక్ కూడా హల్చల్ చేసింది. ఇక, గత ఎన్నికల్లో ఆయన చీరాల నుంచి పోటీ చేసినప్పుడు.. చీరాల రాజకీయాలను మారుస్తానని, ఇక్కడ రౌడీయిజాన్ని అంతం చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ప్రజలు ఆయనను నమ్మి ఓట్లేసి గెలిపించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దంకి రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయినా.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో కరణం వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆధిపత్య రాజకీయాలు.. రౌడీ యిజం కూడా పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. అప్పట్లో అద్దంకి నిత్యం వార్తల్లో ఉంటే.. ఇప్పుడు చీరాల వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమంచి ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇంతటి వివాదాలు లేవు.
కానీ, కరణం ఎంట్రీతో నియోజకవర్గంలో ఉన్న ప్రశాంతం వాతావరణం భగ్నమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాలను విశ్లేషణ చేస్తే.. కరణం ఎక్కడ ఉంటే .. అక్కడ ఘర్షణలు, వివాదాలు, రాజకీయ ఆధిపత్యాలు కామన్ అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి ఇప్పటికైనా కరణం తనంతట తానుగా మారతాడా ? లేదా ? జగన్ మార్క్ ట్రీట్మెంట్ కావాలా ? అన్నది ఆయనకే త్వరలోనే అవగతమవుతుందేమో..?