బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను ధాటికి తమిళనాడు, పుదుచ్చేరిలు గజగజా వణుకుతున్నాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలపై కూడా ఉంది. ఇక పెను తుఫానుగా రూపాంతరం చెంది గురువారం వేకువజామున పుదుచ్చేరి సమీపంలో తీరందాటిన నివర్ తుఫాన్.. ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి సహా ఏపీలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోనూ బుధవారం రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో భారీ వర్షాలు కురవగా.. సోమశిల జలాశయం పూర్తిగా నిండిపోయింది.

అటు పుదుచ్చేరి మరియు తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు, రాయపేట, చెన్నైలోని కురిసిన అతి భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలోని కేకే నగర్, మూడిచూర్, సైదాపేట, అడయార్‌‌ను వాన నీరు చుట్టిముట్టింది. చెన్నైలోని ప్రధాన రహదారులపై రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. తమిళనాడు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అన్ని ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపివేసి.. టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలను వాయిదా వేశారు. కడలూరులో గడచిన 24 గంటల్లో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తర్వాత తామ్రపాకం, పళ్లిపట్టుల్లో దాదాపు 20 సెం.మీ. వర్షం కురిసింది. విల్లుపురంలో గోడకూలి ఓ మహిళ, రాయపేట్‌లో చెట్టుకూలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల తర్వాత చెంబరంబాక్కం జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. మరోవైపు, పుదుచ్చేరిలో గత 24 గంటల్లో అత్యధికంగా 24 సెం.మీ. వర్షం కురిసింది. భారీ వర్షాలతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి నివాసంలోకి వరదనీరు వచ్చి చేరింది. వర్షం నీరును బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో మూడు గంటల పాటు తుఫాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం తుఫాను తీరం దాటినా సముద్రంలో కొంత భాగం కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: