ఇవీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బిజెపి నువ్వా నేనా అన్నట్లుగా కయ్యానికి కాలు దువ్వుతున్ననాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓట్లే లక్ష్యంగా హామీల వర్షం కురుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలను పరిశీలిస్తే సామాన్య ప్రజలకు కూడా ఇది అర్థమవుతుంది.గతం కంటే భిన్నంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి రక్తి కడుతున్నాయి. గ్రేటర్ ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ఎడాపెడా హామీలిచ్చేస్తున్నాయి. చలాన్ల రద్దు, మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు, వరద సాయం రూ. 50 వేలు లాంటి హామీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
ముఖ్యంగా వరద సాయం కింద బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఇస్తామని ప్రముఖ పార్టీ చెప్పిన మాటలు ప్రజల్లో ఆశలు రేపుతున్నా.. ఒకింత ఆలోచన కూడా కలుగజేస్తుంది. ఎందుకంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. గ్రేటర్ బడ్జెట్ పరిధికి మించి హామీలు ఇస్తుండడంతో ఇవి గ్రేటర్ ఎన్నికల లేక సార్వత్రిక అనే రీతిలో రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూ ఉండడం పూర్తి చర్చనీయాంశం అయ్యింది.