అయితే ఈరోజు నుంచి మరో రెండు రోజుల పాటు నగరమంతట మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం నుంచి మద్యం అమ్మకాల పై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కోరారు..గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క బల్క్ మద్యం కొనుగోళ్లు, విక్రయాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
ఒక వ్యక్తికి లేదా సమూహానికి బల్క్ మద్యం విక్రయాలు జరిపితే సంబంధిత మద్యం దుకాణాలపై ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు.నిషేధం ఉన్న రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్లోకి మద్యం సరఫరా జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులతో కలిసి ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలైన సులేమాన్ నగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్ ,శాస్త్రి నగర్ వంటి ప్రాంతాల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..