ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇటీవల రాచకొండ సీపీ మహేష్ భగవత్ కూడా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుందన్ బాగ్ లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీపీ మహేష్ భగవత్ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము అంటూ చెప్పిన సీపీ మహేష్ భగవత్... సీసీ కెమెరాల నిఘా లో ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది అంటూ తెలిపారు.
కాగా ప్రస్తుతం ఎంతో మంది ప్రముఖులు కూడా ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అన్న విషయం తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఫలితాలు 4వ తేదీన వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు.