అయితే సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కరోనా బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా అవకాశం కల్పించారు. గురువారం ఓల్డ్ మలక్పేట్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 4న ఓట్లు లెక్కింపు జరగనుంది. పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకుంది. మొత్తం 150 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం.
ఇక గ్రేటర్ పరిధిలో 74 లక్షల 44 వేల మంది ఓటర్లుంటే… మధ్యాహ్నం 3 గంటలు దాటే సమయానికి ఇందులో సగానికిపైగా ఓటు వేయలేదు. మూసపేట, జూబ్లిహిల్స్ వంటి నగరంలో ఉన్న డివిజన్లతో పాటు గుడిమల్కాపూర్, పటాన్ చెరు వంటి శివారు ప్రాంత ప్రజలు మాత్రం ఓటేశారు. నగరంలోని చాలా చోట్ల వృద్ధులు, గర్భిణిలు, దివ్యాంగులు సైతం ఓటు వేసేందుకు కదిలివచ్చారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారే అత్యంత తక్కువ శాతం ఓటింగ్ శాతం నమోదవడం విశేషంగా చెప్పుకోవాలి. 149 డివిజన్లలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అత్యంత పలుచగా, ప్రశాంతంగా ముగిసింది. ఆర్సీపురం, పటాన్చెరు, అంబర్పేటలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మలక్పేట్, కార్వాన్లో అత్యల్ప శాతం ఓటింగ్ నమోదైంది.