ఉద్రిక్తత తారస్థాయికి చేరిన మహా పోరులో అంతిమ విజయం వరించేది ఎవరిని..? ఉత్కంఠ వీడే సమయం ఆసన్నమైంది! గ్రేటర్ హైద రాబాద్ ఎన్నికల్లో చివరిది, కీలకమైన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మరి కాసేపట్లో వెలువడనుంది.11 గంటల తర్వాత మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 1,926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కౌంటింగ్ వరకూ వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుని, తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేస్తారు..
ఆ తర్వాత మిగిలిన బ్యాలెట్ లని లెక్కిస్తారు.. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.ఈ నేపథ్యంలో 11 వేల లోపు ఉన్న మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్లోనే రానుంది.ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 31 మంది ప్రక్రియను పరిశీలిస్తారు.ఇకపోతే లెక్కింపు ప్రక్రియ సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదలు కానుంది.