విజయనగరం
జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ,
టీడీపీ,
బీజేపీ నేతలు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తొలుత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఆలయాన్ని పరిశీలనకు వెళ్లతున్నట్లు ప్రకించిన వెంటనే..,
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు కంటే ముందే రామతీర్థం చేరుకున్న ఆయన.., కొండెక్కి ఆలయాన్ని దర్శించారు. విజయసాయిరెడ్డి కాన్వాయ్పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో
విజయసాయి రెడ్డి ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. విజయనగరం జిల్లాలోని బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28 అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి కొలనులో పడేసిన విషయం విదితమే. ఈ దుశ్చర్యపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది.
విజయసాయిరెడ్డి శనివారం రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొండకిందకు వచ్చి కారులో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మరోవైపు కొండపైకి చంద్రబాబు నాయుడు, చినరాజప్పలతోపాటు తమను కూడా అనుమతించాలని టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. బీజేపీ నేతలు ఇదే తరహాలో వ్యవహరించారు. దీంతో రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబును విజయనగరంలోని పోలీసులు అడ్డుకున్నారు.
విజయసాయి రెడ్డి రామతీర్థం ఆలయంలోకి వెళ్లిన సమయంలో చంద్రబాబును అనుమతిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశముండటంతో విజయనగంరోనే ఆయన్ని నిలిపేశారు.
విజయసాయి రెడ్డి వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ కి పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు.
మరోవైపు శ్రీరాముడిపై దాడి చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు దోషులను శిక్షించే వరకు రామతీర్థం నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమను ఆలయంలోకి వెళ్లనీయకుండా రాజకీయ నాయకులను అనుమతించడంపై స్వామిజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలయంలో విగ్రహ ధ్వంసంపై పోలీసులు ఐదుగుర్ని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఐతే విగ్రహ ధ్వంసం ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విచారణ పేరుతో తీసుకెళ్లిన పోలీసులు తమ వారు ఎక్కడున్నారో చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు