ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో ఈ విషయం బయటపెట్టారు. ఆయన ఏపీ సీఎంకు యాంటీ అన్న సంగతి తెలిసిందే. అయినా సరే.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అంత ధైర్యంగా రాశారంటే అందులో విషయం ఉండకుండా పోదు. అందులోనూ రాజకీయాల విషయంలో కాస్త అటూ ఇటూగా రాయొచ్చేమో కానీ.. జగన్ ఫ్యామిలీ మ్యాటర్ను కూడా గట్టిగా రాశాడంటే.. విషయం ఏదీ తీవ్రంగా ఉన్నట్టే లెక్క..
ఆంధ్రజ్యోతి కథనంలో సారాంశం ఏంటంటే.. జగన్ ప్రభుత్వం రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయడంలేదని, తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా పక్కనపెడుతూ వచ్చారని తన సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తానేమిటో అన్నకు చూపించాలన్న పట్టుదలతో ఉన్న షర్మిల, తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారట.
ఫిబ్రవరి మొదటి పక్షంలో, బహుశా ఫిబ్రవరి 9వ తేదీన తాను రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టుగా విలేకరుల సమావేశంలో ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నారట. అంతే కాదు.. ఈ విలేకరుల సమావేశంలో శ్రీమతి విజయలక్ష్మి కూడా పాల్గొంటారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారట. ‘తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్’ అని తాను ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీకి నామకరణం కూడా షర్మిల చేసుకున్నారట.