ఏడాది కిందట ప‌రిస్థితి గుర్తు చేసుకుంటే.. ఆ ఎంపీగారి గుండె చెరువు అవుతోంది. ఆయ‌నెటు వెళ్లినా.. పార్టీలో కీల‌క నేత‌ల ఘ‌న స్వాగ‌తాలు.. మందీ మార్బ‌లం.. అంద‌రూ క‌లిసి ఆయ‌న‌ను కేరాఫ్‌గా గుర్తించిన వ్య‌వ‌హారం.. ఆయ‌న క‌ళ్ల ముందు మెదులుతోంది. ముఖ్యంగా గ‌త ఏడాది కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంరంభం మొద‌లైన‌ప్పుడు.. ఎంపీగారి కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూసిన నాయ‌కులు కోకొల్ల‌లు. కానీ.. ఏడాది తిరిగే స‌రికి మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. ఎంత‌గా అంటే.. ఎంపీని ఎవ‌రూ లెక్క‌చేయ‌నంత‌గా! ఆయ‌న వెంట తిరిగేందుకు సైతం ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా రానంత‌గా!!

దీంతో ఇప్పుడు.. ఆ ఎంపీగా రి ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌నే కామెంట్లు వినిపి‌స్తున్నాయి.  ఆయ‌నే విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని. తాజాగా విజ‌య‌వాడ‌లోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప్ర‌చారం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పీఏ.. ఇక్క‌డి కీల‌క నేత‌ల‌కు ఫోన్లు చేసి.. సార్ వ‌స్తున్నారు రెడీ చేయండి.. అని ఆదేశించారు. ఆ వెంట‌నే స‌రే స‌ర్‌! అనే స‌మాధానం కూడా వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. వ‌న్ టౌన్‌లోని మ‌సీదు సెంట‌ర్‌కు ఎంపీగారు వ‌చ్చారు.. కానీ.. కార్య‌క‌ర్త‌లే క‌నిపించ‌లేదు. దీంతో ఏం చేయాలో ఆయ‌న‌కు తోచ‌లేదు. వెంట‌నే త‌నే స్వ‌యంగా జెండా ప‌ట్టుకుని ముందుకు క‌దిలారు.

ఇక‌, ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికి.. ఎంపీగారి మ‌ద్ద‌తుతో ఇక్క‌డ కార్పొరేట‌ర్ స్థానానికి పోటీ చేస్తున్న సీపీఐ నాయ‌కుడు ఒక‌రు ఓ ప‌దిమంది కామ్రేడ్ల‌ను వెంటేసుకుని.. ఎర్ర‌జెండాలు ప‌ట్టుకువ‌చ్చారు. వ‌చ్చిన‌వారితో నే ఎంపీ కార్య‌క్ర‌మం కొన‌సాగించి.. ప్ర‌జ‌ల‌కు ద‌ణ్ణాలు పెట్టారు. ఈలోగా ఓ వ‌ర్గం మీడియా అక్క‌డ‌కు చేరుకోవ‌డంతో.. ఎక్క‌డ బ్యాడ్ అయిపోతానో అనుకుని.. వెంట‌నే కారెక్కి.. వెన‌క్కి వ‌చ్చేశారు. ఇదీ.. ఇప్పుడు విజ‌య‌వాడ‌లో హాట్ టాపిక్‌గా మారిన వ్య‌వ‌హారం.

టీడీపీలో అంద‌రికీ దూర‌మైన ఎంపీ నాని.. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌ను కూడా నిల‌బెట్టుకోలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కొస‌మెరుపు ఏంటంటే.. రెండు రోజుల కిందట ఎంపీగారి వెంట ప్ర‌చారానికి వ‌చ్చిన వారికి టిఫిన్లు కూడా పెట్టించ‌లేద‌నే ప్రచారం జ‌రుగుతుండ‌డం. బ‌హుశ ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రుగుతోందా?  లేక నిజ‌మా ? అనేది తేలాలి. ఏదేమైనా.. ఏడాది ముందున్న ప్ర‌భావం.. ఇప్పుడు లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: