జనసేనాని ఆలోచనలో పడ్డారు. భారతీయ జనతాపార్టీతో పొత్తు అవసరమా? అనే ఆలోచన కలిగినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బీజేపీ-జనసేన కూటమిగా ముందుకు వెళుతున్నాయి. పంచాయితీ ఎన్నికలతోపాటు పురపాలక సంఘాలకు, నగరపాలక సంస్థలకు జరిగే ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేయనున్నారు. ఇటీవలే ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో జనసేన 27 శాతం ఓట్లను సాధించినట్లు పవన్కల్యాణ్ వెల్లడించారు.
బిజెపి.. జనసేన రెండు పార్టీలు ప్రస్తుతం కలిసే ముందుకు వెళుతున్నాయి. బిజెపితో జతకట్టిన తరువాత జనసేన పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దాన్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా కలిసే నడుస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బిజెపి కనీసం 50 పంచాయతీలు కూడా రాష్ట్రంలో సాధించలేకపోవడం.. బిజెపి తరపున మద్ధతుదారులు పూర్తిగా చతికిలపడడం జరిగింది. ఇక జనసేన పార్టీ మధ్దతుదారులు మాత్రం అధిక సంఖ్యలోనే గెలవడమే కాకుండా కొన్ని చోట్ల గట్టి పోటీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ పార్టీ 27 శాతం ఓట్లు సాదించింది.
పంచాయతీల్లో ఘోరపరాజయం భారతీయ జనతాపార్టీకి పెద్ద షాకిచ్చింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని చెప్పుకునే బిజెపికి ఇప్పుడు ఏమీ పాలుపోని పరిస్థితి. తన చరిష్మాతో ప్రజలు ఓట్లేస్తున్నారని.. బిజెపిపై జనంలో ఇప్పటికీ వ్యతిరేకత ఉందని భావించిన పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు బిజెపితో పొత్తు అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారట జనసేనాని. ముందు నుంచి జనసైనికులకు బిజెపితో కలవడం ఏమాత్రం ఇష్టం లేదట. ఇదే విషయాన్ని అధినేత దృష్టికి వారు తీసుకెళ్ళారట. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్ళీ వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో పవన్కల్యాణ్ ఉండటంతో కిందిస్థాయి నాయకులు ఏమీ మాట్లాడలేకపోయారు.
ప్రస్తుతం మాత్రం జనసేనకే ప్రజల్లో ఆదరణ ఉండటం.. జనసేన పార్టీ అభ్యర్థులకు జనం ఓట్లేస్తుండటం పవన్ కళ్యాణ్ ఆలోచనకు ప్రధాన కారణమైంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటే మంచిదన్న అభిప్రాయం ఒకవైపు.. మరోవైపు ఆ పార్టీకి ఏపీలో అంత సీను లేదంటూ స్థానిక నేతలు మరోవైపు చెబుతుండటంతో పవన్కల్యాణ్ దీర్ఘాలోచనలోకి వెళ్లారు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో జనసేనాని ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశమైతే కనపడుతోంది.