ఈ చికిత్స నిర్వహణకు ఖరీదైన మందులను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీనికి గాను సుమారు రూ.16కోట్ల రూపాయలు అవసరమవ్వగా ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రియాంక, మిహిర్ కామత్ ‘క్రౌడ్ ఫండింగ్’ ద్వారా సేకరించారు. ఇంజెక్షన్ దిగుమతికి గాను ఎక్సైజ్ సుంకం సహా.. జీఎస్టీని కేంద్రం రద్దు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని కార్యాలయం సుమారు 6.5 కోట్ల రూపాయల మేర సుంకాలు రద్దు చేసి చేయూతను అందించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 11 మంది పిల్లలకు ‘జోల్జీన్స్మా’ ఇంజెక్షన్ ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.
జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి వ్యాధితో బాధ పడ్తోంది 6 నెలల తీరా కామత్. పాపను బతికించుకోవాలంటే జీనీ థెరపీ చేయాలి. కానీ మన దేశంలో ఈ చికిత్స లేదు. అమెరికా నుంచి 16 కోట్ల విలువైన జోల్ జెన్ స్మా ఇంజక్షన్ తెప్పిస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అయితే ఇంజక్షన్ ఖర్చు భరించే స్థోమత… తీరా కామత్ తల్లిదండ్రులకు లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించారు. మొత్తానికి చిన్నారికి ఇంజక్షన్ ఇవ్వడం పూర్తి కావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. చిన్నారి వైద్యానికి పెద్ద మొత్తంలో సాయం చేస్తే అనేక మంది తమలోని మానవత్వాన్ని నిరూపించుకున్నారు.