ఆ లేఖలో ఏమన్నారంటే.. ‘‘ నడమంత్రపు సిరివస్తే.. కన్నూమిన్నూ గానకుండా విర్రవీగినట్టు ప్రవర్తిస్తున్నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సాటి మనుషులనే అవమానిస్తున్నాడు. ఇప్పటికే తలాతోకలేని మాటలు మాట్లాడే వ్యక్తిగా సమాజంలో ముద్రపడ్డ బండి సంజయ్.. మరోసారి దళితుల పట్ల అమానుషపు వ్యాఖ్యలు చేశాడు. బండి సంజయ్ కు దళితులంటే చెప్పులు కుట్టుకునే వారుగా, మొలలు కొట్టుకునే వారుగా కనపడుతున్నారు. తన బీజేపీ పార్టీ ఆలోచన విధానాలకు ఇది అద్దం పడుతోంది. భారతీయ జనతాపార్టీ విధానాలు బూజు పట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికి, దళితుల అణిచివేతకు అద్దం పట్టేవి అని బండి సంజయ్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి రుజువు చేసాడు.
దళితులకు చెప్పులు కుట్టడమే కాదు, మొలలు కొట్టడం కూడా వచ్చు అని వ్యాఖ్యానించడం ద్వారా.. ఈ ఆధునికయుగంలో కూడా దళితుల స్థితిగతులు ఇంకా అలాగే ఉండాలని సంజయ్ కోరుకుంటున్నట్లు సుస్పష్టమవుతున్నది. దళితులు ఇంకా చెప్పులు కుట్టుకొనే బతకాలని కోరుకోవడం దుర్మార్గం తరతరాలుగా అంటరానితనానికి అణిచివేతకు గురై విద్యకు దూరమైన దళితులకు.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వారికి హక్కులు కల్పించి.. విద్య, ఉద్యాగాలలో అవకాశాలు దక్కేలా చూశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన అవకాశాలతో.. దళితులు అన్ని రంగాలలో అందరితో పోటీ పడి.. ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే.. బండి సంజయ్ కి మింగుడుపడటంలేదు. అందుకే దళితులంటే చెప్పులు కుట్టుకునే వారు గా మొలలు కొట్టుకునే వారుగానే కనపడుతున్నట్లుంది. బండి సంజయ్ ఆ సనాతన బూజుపట్టిన ఆలోచనల నుండి బయటపడి.. దళితులంటే అందరితో సమానంగా అన్ని రంగాలలో పోటీపడుతున్నవారిగా గుర్తిస్తే మంచిది. లేదంటే బండి సంజయ్కి.. బీజేపీ పార్టీకి .. ప్రజలే మొలలు కొడతారు. అంటూ ఘాటుగా విమర్శించారు టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలు.