శశికళ.. తమిళ రాజకీయాల్లో బాగా నలిగిన పేరు.. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె బెంగళూరులోని జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆమె రాక తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిందని అంతా అనుకున్నారు. దీనికి తగ్గట్టే శశికళ జైలు నుంచి తమిళనాడు వచ్చిన తీరు కూడా  సంచలనం సృష్టించింది. ఆమెకు దారిపొడవునా అభిమానులు స్వాగతం పలికారు. ఇక
ఆమె రాకతో రాజకీయాలు మరింత ఊపందుకుంటాయనుకున్న సమయంలో అనూహ్యాంగా ఆమె బాంబు పేల్చారు. ఏకంగా ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేశారు.


అయితే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నా.. రాజకీయాలు మాత్రం ఆమెను విడిచిపెట్టడం లేదు. ఆమె సైలంటుగా ఉంటూనే ప్రధాన పార్టీల గుండెళ్లో బాంబులు పేలుస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారనుకున్న శశికళ ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతున్నారు. ఆమె ఇటీవల చెన్నైలోని అగస్తియర్‌ దేవాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత  తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరువిడైమరుదూరులో ఉన్న మహాలింగస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత తిరుచ్చిలోని శ్రీరంగం దేవాలయాన్ని  కూడా సందర్శించారు.


శశికళ భర్త చనిపోయి మూడేళ్లు పూర్తవుతోంది. అందుకే ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు మరో 2 రోజులు తంజావూరు జిల్లాలోనే ఉంటుందామె. అయితే ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆమె మద్దతు ఎవరికి అనేది పార్టీలను వేధిస్తున్న ప్రశ్న. అన్నాడీఎంకే, ఏఎంఎంకే నేతలు ఎవరికి వారు ఆమె మద్దతు తమకేనంటున్నారు. అయితే వారిలోనూ అనేక అనుమానాలు వేధిస్తున్నాయి. శశికళ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానన్న ప్రకటనలో డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మన ప్రధాన ధ్యేయం కావాలని జయ అభిమానులకు పిలుపు ఇచ్చారు.

మళ్లీ జయలలిత పాలన వచ్చేందుకు కృషి చేయాలని... ఆమె ఆశయాలు నెరవేరాలని... రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని మార్చి 3న ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనను అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్‌ పార్టీలు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఆమె సైలంట్‌గానే ఉన్నా.. ఎన్నికల ముందు ఎవరికి మద్దతిస్తారో అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: