వాస్తవంగా బయట జరుగుతున్న కోవిడ్ మరణాలకు ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్లోని వివరాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదన్న విమర్శలున్నాయి. పత్రికల్లో దీనికి సంబంధించిన కథనాలు కూడా వస్తుండటం గమనార్హం. భోపాల్లోని భద్భాదలో రోజుకు పదుల సంఖ్యలో శవాలు అంత్యక్రియలు చేస్తున్నారు. వంద డెడ్బాడీలకు పైగా అంత్యక్రియలు చేస్తున్నా.. చూపేది రెండు పదుల్లోనే అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈనెల 12న 59 మంది కోవిడ్ పేషంట్లు చనిపోగా ప్రభుత్వం మాత్రం రాష్ట్రం మొత్తం ఆ రోజు చనిపోయింది 37 మందే అని పేర్కొన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ బాంబు సంచలన విషయాలు బయటపెట్టారు. కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చని చెప్పారు. అంతేకాదు రానున్న రోజుల్లో కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలను కూడా తాకవచ్చని ఆయన అంచనా వేశారు. దేశంలో గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 2లక్షలకు చేరువగా(1,84,372) నమోదైన విషయం తెలిసిందే. దీనిపై జమీల్ స్పందించారు. కేసులు రోజురోజుకూ పెరుగుతున్న రేటు చాలా భయపెడుతోందన్నారు. రోజుకు 7 శాతం మేర యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇది చాలా చాలా ఎక్కువని, దురదృష్టవశాత్తూ ఇది ఇలాగే కొనసాగితే.. రోజుకు 3 లక్షల వరకూ కూడా కేసులు పెరగవచ్చని జమీల్ హెచ్చరించారు.