కరోనా మొదటిదశలో కల్తీ బ్లీచింగ్, కల్తీ సున్నం, కల్తీ ఫినాయిల్ వాడకంపై ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించాయి. గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వారికి బిల్లలు చెల్లించడం ఆపింది. ఇప్పుడు వాటి హడావిడి సద్దుమణగడంతో బిల్లుల కోసం తాజాగా పలువురు నేతలు రంగంలోకి దిగారు. పంచాయితీలకు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తేవడంతో ఓ కీలకనేత చెల్లింపు కోసం మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బేరసారాలు నడుస్తున్నట్లు సమాచారం.
దాదాపు 40 శాతం పంచుకున్నారు!!
గతేడాదే బిల్లుల కిందరూ.10 కోట్లు చెల్లించాలంటూ రంగం సిద్ధమైంది. అయితే జిల్లా పంచాయితీ అధికారి విధుల నుంచి సస్పెండ్ అవడంతో ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. రూ.4 నుంచి రూ.5వేల విలువ చేసే స్ర్పేయర్లకు రూ.18 నుంచి రూ.19 వేలు చెల్లించారు. వీటిపై తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రూ.కోటిన్నర విలువైన స్ర్పేయర్లకు రూ.5 కోట్లు చెల్లించారని, ఇందులో 40 శాతం అధికారులు, కాంట్రాక్టర్లు పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఓ కీలక నేత రంగంలోకి దిగి పై నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూస్తా.. బిల్లలు చెల్లించమని ఓ అధికారికి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరికి రావల్సినవి వారు పంచుకునేలా చూస్తానని కూడా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
చెక్పవర్ లేకపోతే ప్రత్యేకాధికారులు చూసుకుంటారులే!!
గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 500 గ్రామాల్లో సర్పంచ్లకు చెక్పవర్ కట్టబెట్టారు. బ్లీచింగ్ బిల్లులు చెల్లింపులకు సహకరించే చెక్పవర్ ఉన్న సర్పంచ్లకు అక్కడే కమీషన్ అందించాలనే నిర్ణయం జరిగింది. చెక్పవర్ లేని గ్రామాల్లో ఉండే ప్రత్యేకాధికారులతో బిల్లులు పెట్టించి చెల్లింపులు జరిగేలా చూస్తున్నారు. బిల్లులు మంజూరుచేస్తే జిల్లాలోని అన్ని గ్రామాలవారీగా 20 శాతం కమీషన్ ఇవ్వాలని అధికార పార్టీ నేతలు, అధికారులు, ఆయా గ్రామ సర్పంచ్లు కలిసి నిర్ణయించినట్లు తెలుస్తోంది.