అయితే, ఎట్టకేలకు రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో పార్టీలోని కొందరు రేవంత్కు వ్యతిరేకంగా గళం వినిపించడం మొదలు పెట్టారు. అయినా రేవంత్ మాత్రం వాళ్లను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. స్వయంగా సీనియర్ల ఇంటికి వెళ్లి వాళ్లను కలిసి మాట్లాడారు. అయినా, రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు కొందరు సీనియర్ నాయకులు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. సమయం దొరికనప్పుడల్లా రేవంత్ రెడ్డికి వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. చివరికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, సీనియర్ నాయకుల ద్వారా ఈ గొడవ సద్దు మణిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలో సింగిల్ హీరోయిజం పనికి రాదని రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హీరోలుగా చిరంజీవి, రజినీకాంత్ ఉన్నారని ఎద్దేవా చేశారు.