ప్రస్తుతం అంతా ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కాస్తో కూస్తో మ‌ల్టీ లాంగ్వేజ్ సినిమాల‌తో నిర్మాత‌లు ఒడ్డెక్కేందుకు అవ‌కాశాలున్నా, వాటిన‌న్నింటినీ తుంగ‌లో తొక్కేందుకు, కేవ‌లం ఓ వ్య‌క్తిపై కోపం వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపించేలా చేసేందుకు ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దం అవుతోంది. ఈ త‌రుణాన గ‌త నిర్ణ‌యాల అవ‌లోక‌న కూడా చేయాలి. ఫీజుల త‌గ్గింపు పై కానీ ఎయిడెడ్ కాలేజీల విలీనంపై కానీ 3 రాజ‌ధానుల నిర్ణ‌యం పై కానీ, సీఆర్డీఏ ర‌ద్దు పై కానీ, శాస‌న మండ‌లి ర‌ద్దు పై కానీ ఇలా చాలా వాటిపై జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలే అస‌లు సిస‌లు అభ్యంత‌ర‌క‌రాలు. వీట‌న్నింటిపై కోర్టు మాట్లాడింది. దేశ‌, రాష్ట్ర స్థాయిల‌లో అత్యున్న‌తం అనుకునే రెండు కోర్టులూ మాట్లాడాయి. ఆఖ‌రికి దిగువ కోర్టులు కూడా మాట్లాడాయి. కొన్ని మొట్టికాయ‌లు కూడా వేశాయి. తీవ్రంగా ప్ర‌తిఘ‌టించాయి. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలపై ఆక్షేపించాయి కూడా! అయినా కూడా తాజాగా ఆయ‌న తీసుకు వ‌చ్చిన సినిమాటోగ్ర‌ఫీ యాక్ట్ లో స‌వ‌ర‌ణ‌లు అంతే స్థాయిలో ఆక్షేప‌ణీయంగా ఉన్నా తాము త‌గ్గేదేలే అని అంటున్నారు పేర్ని నాని అనే మంత్రి. ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ హెరాల్డ్ అందిస్తున్న క‌థ‌నం ఇది.



త‌రుచూ ఏదో ఒక నిర్ణ‌యం వెలువ‌రించ‌డం వెనుక ఉద్దేశం ఏమ‌యిన‌ప్ప‌టికీ వాటి అమ‌లులో మాత్రం వెనుకంజలోనే ఉంటున్నారు జ‌గ‌న్. ఇప్పుడు టికెట్ అమ్మకాలు, ధ‌ర‌ల నియంత్ర‌ణ విష‌య‌మై వివాదాలకు తావిస్తూ టాలీవుడ్ పెద్దల కోపానికి గురి అయ్యారు. తాజాగా ఈ నిర్ణ‌యంతోనే చాలా అవ‌స్థ‌లు కానీ ఇబ్బందులు కానీ జ‌గ‌న్ స‌ర్కారు ఎదుర్కోవ‌డం ఖాయం. ఎందుకంటే జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యంతో పెద్ద సినిమాల మ‌నుగ‌డ ఇవాళ ప్ర‌శ్నార్థకం అయింది. దీంతో త‌మ సినిమాల‌ను ఏ విధంగా గ‌ట్టెంక్కించుకో వాలో తెలియ‌క నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తాజాగా వ‌చ్చే ఆర్ఆర్ఆర్‌పై కూడా ఈ నిర్ణ‌యం తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. ఈ క్ర‌మంలో పెద్ద నిర్మాత‌లు ఏపీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం అవుతున్నారు. కొందరు లాబీయింగ్ ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందేమ‌న‌ని ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్ వ్య‌వ‌స్థ మొత్తం అత‌లాకుత‌లం అయినందున చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఊతం ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకోవాల‌ని మెగాస్టార్ చిరంజీవి కోరుతున్నారు.
ఒకే దేశం ఒకే ప‌న్ను అని ఏ విధంగా చెబుతున్నారో అదేవిధంగా టికెట్ ధ‌ర పై కూడా అదే వెసులుబాటును వ‌ర్తింప‌జేయ‌డం స‌మంజ‌సం అని అంటున్నారు చిరు. ఇవేవీ కాకుండా  వీటిని ప‌ట్టించుకోకుండా ఏపీ స‌ర్కారు నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతోనే పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింద‌ని చిత్ర సీమ వ‌ర్గాలు వాపోతున్నాయి.
ఇంకా చెప్పాలంటే...
దాదాపు ప‌దేళ్ల క‌ష్టం త‌రువాత వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. ఎన్నో అవ‌మానాలు దాటుకుని జ‌గ‌న్ సాధించిన విజ‌యం ఇది. అనూహ్యం అనలేం కానీ టీడీపీ త‌ప్పిదాలు కొన్ని ఆ రోజు జ‌గ‌న్ కు క‌లిసివ‌చ్చాయి. దీంతో పాటు బీజేపీ కూడా జ‌గన్ కు ఆ రోజు తెర వెనుక ఎంతో సాయం అందించింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర స‌మితి కూడా జ‌గ‌న్ కు అనుకూలంగానే ఉంటూ, ఆర్థిక సాయం అందించింద‌న్న వార్త‌లూ విన‌వ‌చ్చాయి. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా అధికారంలోకి రాగానే జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాలే ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ముందు నుంచి మాట త‌ప్పం మ‌డ‌మ తిప్పం అని చెప్పిన జ‌గ‌న్ ఆ విధంగానే న‌డుచు కుంటున్నారా అంటే లేద‌నే స‌మాధానం అన్నింటా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యా లపై త‌రుచూ  కోర్టులో త‌గాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంలో తీసుకువ‌చ్చిన స‌వ‌ర‌ణ‌లు కూడా
కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి చిత్ర సీమ వ‌ర్గాలు. వీటిపై ఇప్ప‌టికిప్పుడు మాట్లాడేందుకు సినిమా పెద్ద‌లు  కొందరు మీడియా ముఖంగా అంగీక‌రించ‌కున్నా, న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న‌కు తామంతా క‌లిసి పోరాడేందుకు సిద్థ‌మేన‌ని
అంటున్నాయి వివిధ చిత్ర నిర్మాణ వ‌ర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp