రెండు, మూడు సంవత్సరాలుగా భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు పెరిగిన సంగతి తెలిసిందే. గల్వాన్‌లోయలో ఘర్షణ ఏకంగా ఇరువైపులా ప్రాణ నష్టానికి దారి తీసింది కూడా. ఆ తర్వాత కూడా అనేక ఘర్షణలు జరిగాయి. సరిహద్దుల కోట్లాట కొనసాగుతూనే ఉంది. విచిత్రం ఏంటంటే.. రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు ఉన్నా.. అదే సమయంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా భారీగానే ఉంటోంది. దేశాల మధ్య ఉన్న ఘర్షణ ప్రభావం వ్యాపారంపై మాత్రం పడక పోవడం విశేషం.


ఎందుకంటే.. భారత్‌- చైనాలు తమ ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ ఏడాది అత్యధిక స్థాయిలో రికార్డు నమోదు చేశాయి. 2021 ఏడాది నవంబర్ వరకు ఇండియా, చైనా మధ్య 10,000 కోట్ల డాలర్లపైనే వాణిజ్య కార్యకలాపాలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఓవైపు సరిహద్దు రక్షణ ఒప్పందాలను తుంగలో తొక్కి తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం హద్దు మీరి ప్రవర్తిస్తోంది. దీని కారణంగా రెండు దేశాల మధ్య కొంతకాలం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఈ ఉద్రిక్తతల ప్రభావం వాణిజ్యంపై పడలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.


అసలు చైనా, ఇండియా మధ్య వాణిజ్య పరిమాణం లెక్కలు తిరగేస్తే.. 2001లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 183 కోట్ల డాలర్లు మాత్రమేనట. అంటే దాదాపు రూ.13,000 కోట్లు అన్న మాట. ఈ ఇరవై ఏళ్లలో అది 500 రెట్లు పెరిగిందన్నమాట. ఈ  20 ఏళ్లలో 10,000 కోట్ల డాలర్ల మైలు రాయిని భారత్, చైనా వాణిజ్యం అధిగమించింది. ఈ ఏడాది ఇండియా, చైనా మధ్య  11,426  కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.8.50 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందన్న మాట. అంటే  గత 20 ఏళ్లలో సగటున వార్షిక ప్రాతి పదికన 46.4 శాతం వృద్ధి నమోదు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: