కరకట్ట మీద చంద్రబాబునాయుడు ఉంటున్న ఇంటి జప్తు విషయంలో సస్పెన్స్ కంటిన్యు అవుతోంది. మంగళవారమే ఏసీబీ కోర్టు  తీర్పు చెబుతుందని అందరు అనుకుంటే అదికాస్త ఈనెల 16వ తేదీకి వాయిదావేసింది. కరకట్టమీద చంద్రబాబు ఉంటున్నది అక్రమ నిర్మాణమని, క్విడ్ ప్రోకోలో భాగమని సీఐడీ వాదిస్తోంది. అయితే ఆ భవనానికి తనకు ఎలాంటి సంబంధంలేదని చంద్రబాబు వాదిస్తున్నారు. తమ విచారణలో భాగంగా కరకట్ట భవనాన్ని జప్వుచేయాలని సీఐడీ నోటీసిచ్చింది.





అలాగే నోటీసుతో పాటు భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటే ఏసీబీ ప్రత్యేకకోర్టులో సీఐడీ పిటీషన్ వేసింది. జప్తు నోటీసు ఇచ్చిన సీఐడీ తన వాదనకు తగ్గట్లుగా డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోలేదని అనిపిస్తోంది. అందుకనే జప్తు అవసరం అన్న వాదనకు తగ్గట్లుగా అవసరమైన డాక్యుమెంట్లను విచారణ సందర్భంగా చూపించలేకపోయింది. దాంతో జప్తు నోటీసు ఇచ్చిన సీఐడీ అధికారిని కూడా విచారణకు రావాలని ఆదేశించింది.





ఒక భవనం జప్తుకు నోటీసు ఇవ్వటమంటే అందుకు అవసరమైన కారణాలతో పాటు ఆధారాలను కూడా చూపాల్సుంటుంది. అందుకనే జప్తుకు నోటీసిచ్చిన అధికారినే విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది. మరి విచారణలో సదరు అధికారి తన చర్యలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలను చూపిస్తారో చూడాలి. ఇదే సమయంలో తన భవనాన్ని జప్తుచేయటం అన్యాయమని ఈ కేసులో తన వాదనను కూడా వినాలని లింగమనేని రమేష్ వేసిన కేసును కోర్టు కొట్టేసింది.





అవసరమైన అన్నీ ఆధారాలతో సీఐడీ కోర్టు విచారణలో పాల్గొనాలని చెప్పి ఈనెల 16వ తేదీకి వాయిదావేసింది. విచిత్రం ఏమిటంటే భవనం విషయంలో చంద్రబాబు, లింగమనేని, సీఐడీ ఎవరి వాదనలకు వాళ్ళు కట్టుబడుంటమే. కాకపోతే లింగమనేని రమేష్ కేసును కోర్టు తోసిపుచ్చటమే ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఉంటున్న భవనం అసలు యజమాని లింగమనేనే. మరి స్వయంగా భవనం యజమాని వేసిన కేసును కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్ధంకావటంలేదు. అంటే 16వ తేదీవరకు కరకట్ట భవనంపై సస్పెన్స్ కంటిన్యు అయ్యేట్లే ఉంది చూస్తుంటే. మరి ఆరోజైనా సస్పెన్సు వీడిపోతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: