
కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించడం వల్లే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదని, దీంతో వైసీపీకి ఆ నియోజకవర్గంలో చిరునామా గల్లంతైందని విమర్శించారు. మళ్లీ చంద్రబాబు ఇంటిపైకి వస్తానంటూ జోగి రమేష్ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి స్పష్టమైన కుట్ర జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నకిలీ మద్యం కుట్ర వెనుక ప్రభుత్వం హస్తం ఉందంటూ జోగి రమేష్ చేసిన కామెంట్లను కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. కల్తీ మద్యం కుట్రకు తెరలేపిన ఎవరిని కూడా వదిలిపెట్టబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లి జనార్ధన్ రావు ఇటీవల విడుదల చేసిన వీడియో మరియు లీకైన వాట్సాప్ చాట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. జోగి రమేష్ ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేశానని, కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికే ఈ కుట్ర పన్నారని జనార్ధన్ రావు తన వీడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి సాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇవ్వడం వల్లే ఈ పని చేశానని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే జోగి రమేష్ తన మనుషుల ద్వారా అధికారులకు లీక్ ఇచ్చి రైడ్ చేయించారని ఆరోపించారు.
మరోవైపు, జనార్ధన్ రావు ఆరోపణలను మాజీ మంత్రి జోగి రమేష్ పూర్తిగా ఖండించారు. ఇదంతా తనను కావాలనే ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నుతున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ కేసును సిట్ ద్వారా కాకుండా సీబీఐకి అప్పగించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. తనకు నకిలీ లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు. ఈ నకిలీ మద్యం కేసు దర్యాప్తును ప్రభుత్వం మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కు అప్పగించింది. ఈ సిట్ అధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. నిందితుల వాంగ్మూలాలు, లీకైన ఆధారాల నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.