టీడీపీ యువనేత, ఐటీ మరియు పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్ మరోసారి రికార్డులు సృష్టించింది. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు. సుమారు 5 వేల ఫిర్యాదులను స్వీకరించిన లోకేశ్ దాదాపు పది గంటల పాటు నిరంతరంగా ప్రజల సమస్యలు విన్నారు. ఇది ఆయన 70వ ప్రజాదర్బార్, కానీ ఇంత భారీ హాజరు నమోదవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రజాదర్బార్‌లో జనం రద్దీని చూసి లోకేశ్ సంతోషం కంటే ఆలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “ప్రజలు నేరుగా మంత్రిని ఆశ్రయిస్తే, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదనే అర్థం వస్తుంది” అని లోకేశ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆయన ప్రకారం, నియోజకవర్గ స్థాయిలో ప్రజా ఫిర్యాదు కార్యక్రమాలు సజావుగా జరగడం లేదని స్పష్టం చేశారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ప్రతి రోజు పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, పార్టీ ఆఫీస్ బేరర్‌తో కలిసి గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని ఆదేశించినా, అది గత కొద్ది నెలలుగా నిలిచిపోయిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించకపోవడం వల్లే ప్రజలు తమ సమస్యలతో నేరుగా పార్టీ కార్యాలయానికి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించి, గ్రీవెన్స్ నిర్వహణపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు హెచ్చరించారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలు, ఎమ్మెల్యేలు తగిన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, ప్రతి ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారో, ఎన్ని సమస్యలు పరిష్కరించారో వివరాల నివేదిక సమర్పించాలని ఆదేశించారు.



సమావేశంలో లోకేశ్ పలు నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు మరణం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తగిన రీతిలో స్పందించలేదని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి ఫరూక్ వ్యవహారాలపై కూడా ఆయన పరోక్షంగా అసంతృప్తి తెలిపినట్లు సమాచారం. అలాగే సీనియర్ నాయకుడు కొనకళ్ల నారాయణ వైసీపీ నేత జోగి రమేష్ అరెస్టు అంశంపై సరిగ్గా స్పందించలేదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి, లోకేశ్ ప్రజాదర్బార్ ప్రజాభిమానాన్ని చాటుతూనే, పార్టీ నేతల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. ఇకపై గ్రీవెన్స్ కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రతి నాయకుడి పనితీరును మానిటర్ చేయాలనే నిర్ణయంతో లోకేశ్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: