తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణం ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతంగా పునర్నిర్మాణం అవుతోంది. ఆదివాసీల ఆరాధ్య దేవతలైన సమ్మక్క–సారలమ్మల గడ్డను కేవలం ఆలయంగా కాకుండా… ఒక సజీవ ఆదివాసీ సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం సాగుతోంది. ఈ మహత్తర కార్యానికి స్వయంగా అడవి బిడ్డ అయిన మంత్రి సీతక్క నాయకత్వం వహిస్తున్నారు. మేడారం అభివృద్ధి ఆమెకు పదవి బాధ్యత మాత్రమే కాదు… భావోద్వేగ అనుబంధం. అందుకే రోజూ పనుల పురోగతిపై ఆరా తీస్తూ, ఎక్కడా ఆలస్యం జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులు .. మేడారం పునర్నిర్మాణంలో దాదాపు 4,000 టన్నులకు పైగా కృష్ణశిలను వినియోగిస్తున్నారు. గద్దెల ప్రాంగణాన్ని 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 46 భారీ స్తంభాలతో నిర్మిస్తున్నారు.
 

భక్తులు ప్రధానంగా దర్శించుకునే గద్దె చుట్టూ 8 ప్రత్యేక స్తంభాలను ఏర్పాటు చేసి, గద్దెల మధ్యలో వెదురు ఆకృతులను ఆదివాసీ సంప్రదాయం ఉట్టిపడేలా రూపకల్పన చేశారు. ఈ ప్రాంగణంలో దాదాపు 7,000 శిల్పాలు కొయ్య తెగ సంస్కృతి, వారి వంశావళిని కళ్లకు కట్టేలా చూపిస్తాయి. ప్రాకార గోడలపై కొయ్యల చరిత్రను తెలిపే చిహ్నాలు, ఘట్టాలను చెక్కుతున్నారు. ప్రధాన ద్వారం వద్దనే సమ్మక్క వంశానికి చెందిన 59 శిల్పాలను ప్రతిష్టించగా… మొత్తం 7,000 శిల్పాలు సుమారు 750 కొయ్య వంశాల పేర్లను ప్రతిబింబించేలా రూపొందుతున్నాయి. దీంతో ఈ ప్రాంగణం ఒక సజీవ ఆదివాసీ విజ్ఞాన కేంద్రంగా మారుతోంది. భారీ తోరణాలు… కళకు ప్రతీక .. మేడారం ఆలయానికి శోభనిచ్చేలా వివిధ పరిమాణాల్లో భారీ తోరణాలను నిర్మిస్తున్నారు. ఇందులో 50 అడుగుల ఎత్తు గల ఒక ప్రధాన తోరణం, 40 అడుగుల ఎత్తు ఉన్న మూడు తోరణాలు, 30 అడుగుల ఎత్తు ఉన్న ఐదు తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ తోరణాలు భక్తులకు స్వాగతం పలుకుతూ… కాకతీయ శైలి, ఆదివాసీ నిర్మాణ శైలుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తాయి.



ప్రాచీనతకు భంగం కలగకుండా అభివృద్ధి .. ఈ భారీ ప్రాజెక్ట్‌ను డాక్టర్ హరిప్రసాద్ నేతృత్వంలో 250 మంది నిపుణులైన శిల్పులు చెక్కుతున్నారు. ప్రముఖ పురావస్తు నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. రూపకల్పన, డాక్యుమెంటేషన్‌లో 15 మంది ఆర్కియాలజీ విద్యార్థులు పాల్గొంటూ… ప్రాచీనత దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని విస్మరించకుండా, ప్రాంగణంలోని పాత చెట్లను అలాగే సంరక్షిస్తున్నారు. అదనంగా 12 రకాల పవిత్ర అటవీ వృక్షాలు, 140 రకాల ఔషధ మొక్కలను నాటుతూ పవిత్ర వనాన్ని రూపొందిస్తున్నారు.ఈ పునర్నిర్మాణం పూర్తయితే… మేడారం కేవలం ఒక జాతర ప్రదేశంగా కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందుతుందన్న విశ్వాసం ప్రభుత్వానికి ఉంది. సమ్మక్క–సారలమ్మ గడ్డ… ఇప్పుడు గ్లోబల్ గుర్తింపుకు సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: