పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాలు త్వరలో పరుగులు తీయనున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హైవేపై వాహనాల రాకపోకలకు 'గ్రీన్'సిగ్నల్ ఇవ్వడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఈ హైవేను అందుబాటులోకి తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి, తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్నారు.
తెలంగాణలోని ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్న యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని మొత్తం పొడవు 162.10 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 56.88 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. చింతలపూడి మండలం రేచర్ల దగ్గర ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించి, కన్నాయగూడెం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
నేషనల్ హైవే 365 బీజీ కింద ఖమ్మం - దేవరపల్లి నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి 162 కి.మీ మేర సుమారు రూ.4,609 కోట్లతో నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దూరం సుమారు 125 కిలోమీటర్లు తగ్గుతుంది. ఎందుకంటే.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే విజయవాడ మీదుగా 676 కి.మీ 12 గంటలు ప్రయాణించాలి. అదే ఈ హైవే అందుబాటులోకి వస్తే దాదాపు 125 కి.మీ.దూరం తగ్గుతుందని, దూరం మాత్రమే కాకుండా, ట్రాఫిక్ కూడా తగ్గడంతో దాదాపు 5 గంటల వరకు సమయం ఆదా అవుతుంది అంటున్నారు. ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల మధ్య కొంత భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ వివాదం పరిష్కారం కావడంతో, రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్ని త్వరగా పూర్తిచేసి అందుబాాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి