ఏపీలో అధికార టీడీపీకి వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకే ఆ పార్టీ నేతలకు పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం పోయినట్లుంది. దీంతో వారంతా వరుసపెట్టి పార్టీ మారిపోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువా కప్పుకున్నారు.
పార్టీ మారిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అయితే ఏపీలో టీడీపీలో తనకు సన్నిహితంగా ఉన్న నేతలు అందరికి ఫోన్లు చేసి బీజేపీలోకి రావాలని... భవిష్యత్తుపై తాను హామీ ఇస్తానని చెపుతున్నారట. ఇక తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరగా ఇప్పుడు మరో షాక్ తగిలింది.
కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ సొంత మండలం పామర్రుకు చెందిన పార్టీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణ బాబు పార్టీకి గుడ్బై చెప్పారు. మంగళవారం ఆయన భార్యతో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఏదేమైనా నెల రోజులకే పరిస్థితి ఇలా ఉందంటే.. మరో నాలుగైదు నెలల్లో ఏపీలో టీడీపీ వలసలలతో మరింత నష్టపోవడం కాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం లేకే వారంతా బీజేపీ బాట పడుతున్నారు.