ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల మధ్యనే పోటీ ఉండేది. మూడో పార్టీ లేదు. వచ్చినా పెద్దగా కలిసి రాలేదు. బీజేపీ ఎదగడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 2014 లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచే తెలంగాణాలో తెరాస పార్టీ హవా మొదలైంది. ఆ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది.
అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏపి లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పొతే, వైకాపా మెరుగైన ఫలితాలు దక్కించుకొని ప్రతిపక్షంలో కూర్చున్నది. 2019 లో తెలంగాణాలో తెరాస పార్టీనే అధికారంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. పార్టీ కేడర్ మొత్తం తెరాస లోకి వెళ్ళిపోయింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీ మళ్ళీ లైన్లోకి వచ్చింది.
అంతేకాదు, 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలను చేయడంతో బీజేపీపై నమ్మకం ఏర్పడింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పనులైనా చేయగలుగుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో చాలామంది నేతలు బీజేపీ లో జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్నారు.
అందుకు తగినట్టుగా ప్లాన్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 18 న హైదరాబాద్ లో జరిగే భారీ సభలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖులు బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏకంగా 20 వేలమంది బీజేపీలో జాయిన్ కాబోతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో పాగావేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే మిషన్ 2024 ను ప్రారంభించింది బీజేపీ. ఇప్పుడు తెలంగాణాలో జరిగే ఎన్నికలు తెరాస వర్సెస్ బీజేపీగా ఉండబోతున్నాయి.