తనకు బలం ఉన్న చోట ఎంత పెద్ద శత్రువునైనా ఓడించవచ్చు. బలం లేని చోట సైలెంట్ గా ఉండటం కంటే మరొకటి మేలుకాదు. అందుకే బలం పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంటారు. అది మనిషి కాబట్టి. కానీ, ప్రకృతిలో నివసించే జంతువులకు ఒక్కచోట మాత్రమే బలం ఉంటుంది. నీళ్లలో నివసించే వాటిని నీటిలోను, భూమిపై నివసించే వాటికి భూమిమీద బలం ఉంటుంది. భూమిమీద బలమైన జంతువు ఏనుగైనా సరే నీటిలోకి అడుగుపెట్టి మొసలికి చిక్కితే.. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దాని బలం అలాంటిది మరి.
గజేంద్ర మోక్షంలో అదే చెప్తారు. ఏనుగును రక్షించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దిగి రావాల్సి వస్తుంది. ఇది వేరే విషయం అనుకోండి. అయితే, మొసళ్ళు నీళ్లలోనే కాకుండా భూమిమీదకూడా తిరుగుతుంటాయి. అయితే, భూమి మీద వాటికి బలం తక్కువగా ఉంటుంది. అందుకే అవి భూమిమీద దాడులు చేయడం తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న ఎత్తులను కూడా పెద్దగా ఎక్కలేవు. కానీ, ఓ మొసలి మాత్రం పెద్ద సాహసం చేసింది.
పెద్ద ఇనుప కంచెను అమాంతం ఎక్కి అవతలికి దూకేసింది. మొసళ్ళు అలా దూకడం ఎప్పుడు చూడలేదు. మనదగ్గర అంటే ఎప్పుడో ఒక్కసారే మొసళ్ళు జనావాసాల్లోకి వస్తాయి. కానీ అమెరికాలాంటి దేశాల్లో తరచుగా మొసళ్ళు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటాయి. ఇంట్లో బెడ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంటాయి. ఇలా ఎన్నోసార్లు జరిగాయి. అయితే, కంచె దూకామ వంటివి మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు జాక్సన్ విల్లే ప్రజలు.
ఇటీవలే క్రిస్టీన్ స్టీవార్ట్ అనే మహిళా జాక్సన్ విల్లేలోని ఆర్మీ స్థావరం గుండా ప్రయాణం చేస్తుండగా ఓ మొసలి రోడ్డు క్రాస్ చేసి ఓ పెద్ద ఇనుప కంచెను దూకింది. ఆలా కంచె ఎక్కి దూకే దృశ్యాన్ని ఆమె వీడియోగా తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన చాలామంది షాక్ అయ్యారు. అంతపెద్ద మొసలి ఎలా ఆ కంచె దాటింటో తెలియక అయోమయంలో పడిపోయారు.