బీజేపీ రథసారథి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం నేపథ్యంలో...ఆయన అభిమానులు, వివిధ పార్టీల నేతలు, పలువురు వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రధాని మోదీకి ఉండాలని ఆకాంక్షించినట్టు చెప్పారు.
కాగా, టీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు.
మరోవైపు....ప్రధాని నరేంద్ర మోదీని అమితంగా అభిమానించే ఓ వ్యక్తి.. ఆయన జన్మదినం సందర్భంగా.. హనుమాన్కు బంగారు కిరీటాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. వారణాసి నియోజకవర్గానికి చెందిన అర్వింద్ సింగ్ అనే వ్యక్తి.. మోదీ రెండోసారి అధికారంలోకి వస్తే బంగారు కిరీటాన్ని సమర్పిస్తానని ఎన్నికల సమయంలో మొక్కుకున్నట్లు సింగ్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్డే సందర్భంగా ఆ బంగారు కిరీటాన్ని దేవునికి సమర్పించానని చెప్పారు. ఈ కిరీటం 1.25 కేజీల బరువున్నట్లు పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు మోదీ హయాంలో జరుగుతుందన్నారు అర్వింద్ సింగ్. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఇదిలాఉండగా...అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్హౌజ్లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. మోదీని త్వరలో కలుసుకోనున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్లను త్వరలోనే కలవనున్నట్లు తెలిపారు. రెండు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గినట్లు ట్రంప్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 22న హూస్టన్లో జరగనున్న హౌదీ మోదీ సభకు ట్రంప్ హాజరుకానున్నారు. అయితే ఈనెల చివర్లోనే న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ పాక్ ప్రధాని ఇమ్రాన్తో ట్రంప్ భేటీకానున్నట్లు తెలుస్తోంది.