దసరా... విజయదశమి... భారతదేశంలోని అనేక ప్రాంతాలలో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే చాలా ప్రముకమైన పండుగ.మొదటగా దసరా పండుగ అంటే ఏమిటో చూద్దామా మరి... దసరా పండుగకి మూడు పౌరాణిక సందర్భాలు కలసి వస్తాయి . వీటిలో మొదటిది రాముడు రావణుడిని సంహరించిన రోజు అని. రెండోది పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకుని, జమ్మి చెట్టు మీద దాచి వుంచిన తమ ఆయుధాలను కిందకి దించి ఉత్తర గో గ్రహణాన్ని నిరోధించిన రోజు అని. ఇక మూడవది లోక కంటకుడైన మహిషాసురుడిని జగన్మాత పదిరోజుల యుద్ధం అనంతరం సంహరించిన రోజు అని. ముచ్చటగా మూడు పౌరాణిక ప్రాధాన్యాలున్న ఈ రోజును దేశమంతటా ఆనందోత్సాహాలతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. 


ఈ తరహాలో విజయదశమి పర్వదినాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో చూద్దామా మరి... విజయదశమిని అత్యంత వైభవంగా జరుపుకునే రాష్ట్రాల్లో రాజస్థాన్ రాష్ట్రం కూడా  ఒకటి. నిజానికి రాజస్థాన్ రాజపుత్రుల జన్మస్థానం. రాజస్థాన్ లో  ఏ పనిచేసినా వైభవంగా వుంటుంది. అత్యంత శక్తివంతులైన రాజపుత్రులకు నిలయమైన రాజస్థాన్‌లో దసరా నవరాత్రుల సందర్భంగా శక్తికి అధిదేవత అయిన జగన్మాతను భక్తి  శ్రద్ధలతో పూజిస్తారు.ఇక వీరులు కూడా తమ ఆయుధాలను జగన్మాతకు సమర్పిస్తారు.


విజయదశమి నవరాత్రులను దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుపుకున్నట్లే  రాజస్థాన్‌లోనూ  వైభవంగా జరుపుతారు. అమ్మవారికి  9 రోజులు వివిధ రకాల అలంకారం కూడా చేస్తారు. రాజస్థాన్ సంప్రదాయమైన రంగురంగుల బట్టలు ధరించిన భక్తులు అమ్మవారిని సందర్శించుకుంటారు. విజయదశమి వేడుకలలో ప్రతిరోజూ రాజస్థానీ జానపద నృత్యమైన ‘గుమార్’ ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుంది. 


రాజస్థాన్‌లో దసరా వేడుకలు జరిపే విషయంలో అగ్రస్థానంలో నిలిచేది ‘కోట’ అనే  పట్టణం. కోట పట్టణంలో  దసరా సందర్భంగా అనేక సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. పట్టణమంతా మేళాలు జరుగుతూనే వుంటాయి. ఈ పది రోజులూ కోట ప్రజలు దసరా పండుగను తప్ప మరో విషయాన్ని పట్టించుకోరంటే నమ్మండి. పలువురు కళాకారులు రామాయణంలోని వివిధ ఘట్టాలను నాటక రూపంలో ప్రదర్శిస్తారు. దసరా వేడుకల ముగింపు రోజు రావణ సంహార ఘట్టాన్ని కూడా ప్రదర్శిస్తారు. అదేరోజు 75 అడుగుల ఎత్తున నిర్మించిన రావణ, కుంభకర్ణ, మేఘనాథ బొమ్మలను దహనం చేస్తారు. ఈ సందర్భంగా ‘జై సియారామ్’ అనే నినాదాలు కోట అంతటా  ప్రతిదావనిస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: