కొందరు నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈ మహర్నవమి నాడు ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు. మహార్నవమి రోజున ఇతర పిండి వంటలతోపాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు.
నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది మంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి, నుదుట కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు. తెలంగాణాలో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతీ ఉద్యాపన చేస్తారు.
ఇక, తన పూర్వీకులను పునీతులను చేయడానికి భగీరథుడు గంగను భువి నుంచి దివికి తెచ్చింది కూడా ఈనాడే. ఇక నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైన నవమి తిథి నాడు మంత్ర సిద్ది కలుగుతుంది. కాబట్టి దీనికి సిద్ధదా అని పేరు. దేవి ఉపాసకులు అంతవరకు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు నిర్వహిస్తారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగుతాయని నమ్మకం.
క్షత్రియులు, కార్మికులు, వాహనదారులు, కులవృత్తులవారు ఆయుధపూజను నిర్వహిస్తారు. హిందువులు ఏ పనిలోనైనా విజయం సాధించాలని, వాహనాలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షిత్తంగా ఉండాలని, ప్రారంభించే ఏ వ్యాపారమైనా విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటారు. అందుకు ఆయుధ పూజను చేస్తారు. నవమి మధ్యాహ్నం 12.52 వరకు ఉంటుంది కాబట్టి ఈ లోగా పూజను పూర్తిచేయాలి.