ప్రస్తుతం తెలంగాణాలో కూడా అదే జరుగుతుంది. రెండోసారి గెలిచినా కూడా తెరాస తన వైఖరి మార్చుకోకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ప్రాంతీయ నాయకత్వం కోసం ఎదురుచూస్తూ ఉన్న తెరాస ను మాత్రమే ఎంచుకుంటున్నారు. మరొకరికి ఓటు వేస్తె మళ్ళీ తెలంగాణ పరిస్థితి ఏమిటో అనేది కూడా వాళ్ళ మనసులో ఆలోచన అయి ఉండవచ్చు. అందుకే వేరే పార్టీ వైపు చూడలేకపోయారు, అలాగని తెరాస ను గెలిపించుకుంటే వాళ్ళు మాత్రం కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే పని తప్ప మరొకటి చేయడం లేదు. పోనీ వాళ్ళు చేస్తున్నారు, ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తాయేమో అనుకుందామన్నా కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు పదేళ్లు అవుతుంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు చెప్పిన అభివృద్ధి కనిపించట్లేదు.
ముఖ్యంగా ఉద్యోగాలు విపరీతంగా వస్తాయి అనుకున్న నిరుద్యోగుల కు ఆశలు నిరాశలే అయ్యాయి. అప్పటి నుండి ఎన్నో నిరసనలు తెలియజేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. దీనితో ఇంకా వేచి చూడలేక, వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళనతో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ చూసినా కూడా తెరాస ప్రభుత్వం చలించకపోగా గత ప్రభుత్వాల వలన ఈ పరిస్థితి వచ్చింది అని విమర్శలు గుప్పిస్తూ తప్పించుకున్నారు.