ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యువ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోతున్నారు. దేశవాళీల్లో భారీ ఇన్నింగ్స్‌లతో సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతూ అదరగొడుతున్నారు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీ వీళ్ల బ్యాటింగ్ విన్యాసాలకు వేదికగా మారింది. కుర్రాళ్లు ఈ స్థాయిలో బ్యాటు ఝుళిపిస్తుండడంతో ఇప్పటికే వారిని కొనుగోలు చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు తెగ ఖుషీ అయిపోతున్నాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ వెంకటేశ్‌ అయ్యర్‌ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. 146 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 198 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే కేవలం రెండు పరుగుల దూరంలో డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

ఆదివారం విజయ్ హజారే ట్రోఫీ గ్రూఫ్‌-బీలో భాగంగా మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌ 50 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 402 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్ వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఏకంగా 198 పరుగులు చేయడంతో ఈ స్థాయి స్కోరు నమోదైంది. అయ్యర్‌కు తోడు అదే జట్టులోని ఆదిత్య శ్రీ వాత్సవ(84 నాటౌట్) రాజత్‌ పాటిదార్‌(54) చక్కటి సహకారం అందించారు. ఇక ఆ తరువాత 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ జట్టు 42.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్‌ బ్యాటింగ్‌లో అభిషేక్‌ శర్మ(104 పరుగులు) సెంచరీతో రాణించాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మన్ అంతా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

అయ్యర్‌ డబుల్‌ సెంచరీ మిస్‌ అయినా.. కేకేఆర్‌ మాత్రం ఈ ఇన్నింగ్స్‌తో తెగ సంబర పడిపోతోంది. ఎందుకంటే వెంకటేశ్‌ అయ్యర్‌ను ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో కేకేఆర్ జట్టు రూ.20లక్షలతో సొంతం చేసుకుంది. ఈ జోష్‌తో కేకేఆర్‌ అతని ఇన్నింగ్స్‌ను తెగ ప్రశంసిస్తోంది. అందులో భాగంగానే అతడి ఫోటోను షేర్‌ చేస్తూ కంగ్రాట్స్‌ చెప్పింది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఢిల్లీ ఆటగాడు పృధ్వీ షా ఏకంగా డబుల్ సెంచరీ సాధించి రికార్డుల మోత మోగించిన విషయం తెలసిందే. 237 పరుగులతో నాటౌట్‌గా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా ఈ మధ్య ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: