మొన్న‌టి దాకా తౌక్టే తుఫాను ఎంత బీభ‌త్సం సృష్టించిందో చూశాం. ఇప్పుడు అది త‌గ్గిందో లేదో మ‌రో తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడ్డ యాస్ తుఫాన్ ప్ర‌ళ‌య భీక‌రంగ మారింది. దీని దెబ్బ‌కు తీర ప్రాంతాల‌న్నీ గ‌డ‌గ‌డ‌లాడుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నీటితో మునిగిపోయాయి. ప‌ట్ట‌ణాలన్నీ నీటితో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

అయితే ఇలాంటి అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఓ విచిత్రం జ‌రిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చెక్క‌ర్లు కొడుతోంది. అందులో ఓ మానిటర్ బల్లి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. తుఫాన్ దాటికి పలు ప్రాంతాలు నీట మునగడంతో సముద్రంలోని మొసళ్లు, మానిటర్‌ బల్లులు వరదల్లో ఇళ్ల ముందుకు కొట్టుకొచ్చాయి. వీధుల్లో తిరుగుతూ జ‌నాల‌ను భ‌య బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి.


తాజాగా కోల్‌కతా నగరంలోని దమ్‌ దమ్‌ ఏరియాలో ఓ వీధిలో మానిటర్‌ బల్లి తిరుగుతూ కనిపించింది. ఈ మానిటర్‌ బల్లి అతి భ‌యంక‌రంగా అచ్చం మొసలి లాగే ఉంది. నీటిలో క‌ద‌లాడుతూ అంద‌రినీ చాలా సేపు వ‌ణికించింది. ఇదొక్క‌టే కాదు మొసళ్లు కూడా వరద నీటిలో అటుఇటు తిరుగుతూ క‌నిపించాయి. దీంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు భయాందోళనకు గురవుతున్నారు.

అందులో కొంద‌రు వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌గా తెగ వైర‌ల్ అవుతున్నాయి. మానిట‌ర్ బ‌ల్లి సంచ‌రిస్తున్న వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీణ్ అంగుసామీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా విప‌రీతంగా వైరల్ అయింది. దీంతో స్థానికంగా ఉన్న అటవీశాఖ అధికారులు విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకుని, ఓ మానిటర్‌ బల్లితో పాటు ఓ మొసలిని పట్టుకున్నారు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను కార‌ణంగా స‌ముద్రంలోని జంతువులు ఇలా ఇళ్ల‌లోకి వ‌స్తున్నాయని అక్క‌డి అధికారులు చెబుతున్నారు. ఎక్క‌డైనా ఎలాంటి ప్రాబ్ల‌మ్ వచ్చినా త‌మ‌కు తెలియ‌జేయాల‌ని అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం యాస్ తుఫాన్ ఒడిశా మీదుగా వీస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: